మీనా, ప్రవీణ్లు పోలీసు వ్యవస్థకే మచ్చ: బాబు
హైదరాబాద్: రాయలసీమ ఐజి మీనా, అనంతపురం పోలీసు సూపరింటిండెంట్ (యస్పీ) ప్రవీణ్కుమార్ పోలీసు వ్యవస్థకే మచ్చ తెస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు విమర్శించారు. అనంతపురం జిల్లా పెనుకొండలో గొడవ సృష్టించింది కాంగ్రెస్వారేనని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. పెనుకొండలో గాయపడి నిమ్స్లో చికిత్స పొందుతున్నవారిని ఆయన పరామర్శించారు.
పెనుకొండ పోలీసు కాల్పుల్లో, ఘర్షణల్లో గాయపడిన 18 మందిలో ఎనిమిది మందిని హైదరాబాద్లోని నిజాం వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్)కు తరలించారు. వీరిలో ఐదుగురు ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స పొందుతున్నారు. క్షతగాత్రుల వైద్య ఖర్చులను భరించే విషయంపై ఆలోచన చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు. పోలీసులు హద్దుమీరి ప్రవర్తిస్తున్నారని, వారిని ప్రభుత్వం అదుపు చేయలేకపోతున్నదని, ఒకరిద్దరు పోలీసు అధికారుల వల్ల పోలీసు వ్యవస్థకే కళంకం ఏర్పడే పరిస్థితి దాపురించిందని ఆయన అన్నారు.
అల్లరి చేస్తున్న వారిపై పోలీసులు కాళ్లపైకి కాల్పులు జరుపుతారని, అనంతపురం జిల్లా పెనుకొండలో అలా జరగలేదని, చంపడానికే కాల్పులు జరిపినట్లుగా ఉన్నదని ఆయన అన్నారు. హింసతో రాజ్యమేలాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications
