యుపిఎపై యన్డిఎ ఆరోపణల చిట్టా
న్యూఢిల్లీ: ఐక్య ప్రగతిశీల కూటమి (యుపి ఎ) ఏడాది పాలనపై జాతీయ ప్రజాస్వామ్య కూటమి (యన్డి ఎ) మంగళవారంనాడు రిపోర్టు కార్డును విడుదల చేసింది. రాజ్యాంగ సంస్థలను యుపి ఎ ప్రభుత్వం దిగజారుస్తోందని యన్డి ఎ తన నివేదికలో యుపి ఎ ప్రభుత్వంపై ధ్వజమెత్తింది. అంతర్గత భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వ విధానాలను తప్పు పట్టింది.
రాజ్యాంగ సంస్థల విలువను యుపి ఎ ప్రభుత్వం దిగజార్చిందని, అందుకు ప్రధాని కార్యాలయం ఒక ఉదాహరణ అని భారతీయ జనతా పార్టీ (బిజెపి) అధ్యక్షుడు ఎల్.కె. అద్వానీ అన్నారు. ఆర్థిక విధానాలపై సంకీర్ణ ప్రభుత్వంలోని భాగస్వామ్య పక్షాలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయని ఆయన అన్నారు. ప్రభుత్వానికి, వామపక్షాలకు మధ్య గల వైరుధ్యాలను ఆయన ఈ సందర్భంగా ఎత్తిచూపారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ మంచి వ్యక్తి అని, అయితే బలహీనమైన ప్రధాని ఆయన అన్నారు. అంతర్గత భద్రత విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, నక్సల్స్ సమస్యను రాష్ట్ర ప్రభుత్వాలకు వదిలేయడం అందుకు నిదర్శనమని ఆయన అన్నారు.