మహారాష్ట్రపై సిడబ్ల్యుసికి టిఆర్యస్ మొర
న్యూఢిల్లీ: గోదావరినదిపై మహారాష్ట్ర నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టుల నిర్మాణాలను పరిశీలించేందుకు కేంద్ర బృందాన్ని పంపాలని తెలంగాణ రాష్ట్ర సమితి (టి ఆర్యస్) పార్లమెంటు సభ్యులు కేంద్ర జలసంఘాన్ని కోరారు. మహారాష్ట్ర ప్రాజెక్టులపై తమకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ విధమైన ఫిర్యాదు అందలేదని కేంద్ర జలసంఘం చెప్పినట్లు టి ఆర్యస్ పార్లమెంటు సభ్యుడు వినోద్ రెడ్డి మీడియా ప్రతినిధులతో చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తమతో సహకరిస్తే సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తామని జల సంఘం అధికారులు చెప్పినట్లు ఆయన తెలిపారు.
మహారాష్ట్ర ప్రాజెక్టుల వల్ల శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎండిపోతుందని, అదే జరిగితే తెలంగాణ మొత్తం ఎడారిగా మారిపోతుందని టి ఆర్యస్ పార్లమెంటు సభ్యులు జలసంఘానికి తెలియజేశారు. మహారాష్ట్ర ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వవద్దని, మహారాష్ట్ర ప్రాజెక్టుల నిర్మాణంపై విచారణ జరపించాలని వారు కోరారు. తాము మహారాష్ట్ర ప్రాజెక్టులపై అవసరమైతే ఒక కమిటీ చేత విచారణ జరిపిస్తామని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు వస్తే ఇరు రాష్ట్రాల మధ్య సమావేశం ఏర్పాటు చేసి సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తామని జల సంఘం ఉన్నతాధికారులు హామీ ఇచ్చినట్లు టి ఆర్యస్ ప్రతినిధి విద్యాసాగర్ రావు చెప్పారు. మహారాష్ట్ర 60 టియంసిల నీటికి లోబడే వాడుకునేట్లు ప్రాజెక్టులను నిర్మిస్తోందా, లేదా అనే విషయంపై పరిశీలన చేయిస్తామని కూడా చెప్పినట్లు ఆయన తెలిపారు.