బిహెచ్ఇయల్లో షేర్ల అమ్మకానికి క్యాబినెట్ ఓకే
న్యూఢిల్లీ: బిహెచ్ఇయల్ 10 శాతం షేర్లను ఉపసంహరించుకోవాలని కేంద్ర మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. వామపక్షాలు వ్యతిరేకిస్తున్నప్పటికీ వాటాల ఉపసంహరణలో కేంద్ర ప్రభుత్వం ముందుకు అడుగేస్తోంది. బిహెచ్ ఇయల్లో షేర్ల అమ్మకాలను తాము వ్యతిరేకిస్తామని వామపక్షాలు అంటున్నాయి. షేర్ల ఉపసంహరణపై తమకు మాట మాత్రంగానైనా చెప్పలేదని సిపి ఐ నిరసన వ్యక్తం చేస్తోంది.
గోద్రా రైలు దుర్ఘటనపై విచారణకు నియమించిన బెనర్జీ కమిటీ గడువును మరో మూడు నెలలు పొడిగిస్తూ కూడా మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ యు.సి. బెనర్జీ నేతృత్వంలోని ఈ కమిటీని యుపి ఎ అధికారంలోకి రాగానే రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ నియమించారు. ఈ ఏడాది జనవరి 17వ తేదీన కమిటీ తన మధ్యంతర నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. 59 మంది కరసేవకులు మృతి చెందిన ఈ దుర్ఘటన ప్రమాదవశాత్తు జరిగిందేనని కమిటీ అభిప్రాయపడింది. ఇది అప్పట్లో తీవ్ర వివాదానికి కారణమైంది.