వేలంవెర్రి వద్దు: రైతులకు వైయస్ సూచన
ఒంగోలు/ గుంటూరు: వేలం వెర్రిగా పంటలు వేయవద్దని ముఖయ్మంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి రైతులకు సూచించారు. పండ్ల తోటల వంటివి పెంచాలని ఆయన అన్నారు. ఆయన గురువారంనాడు ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో పర్యటించారు. మార్కెట్ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని పంటలు వేయాలని కూడా ఆయన సూచించారు. సంప్రదాయ పంటలు వేయడం మానేయాలని ఆయన రైతులకు పదే పదే సూచించారు.
తాము పాడిపంటలను ప్రోత్సహిస్తామని ఆయన చెప్పారు. వ్యవసాయ రంగానికి గత తెలుగుదేశం ప్రభుత్వం ఏమీ చేయలేదని ఆయన విమర్శించారు. మిర్చి, పొగాకు రైతుల కష్టాలు తనకు తెలుసునని, వాటి కొనుగోలుకు ప్రభుత్వం ఇంత కన్నా ఏమీ చేయలేమని ఆయన అన్నారు. వ్యవసాయ రంగంలో మన రాష్ట్రం త్వరలోనే పంజాబ్ను మించిపోతుందని ఆయన అన్నారు. సకాలంలో సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని ఆయన చెప్పారు.
ముఖ్యమంత్రి కాన్వాయ్లోని ఒక పోలీసు జర్నలిస్టుల పట్ల దురుసుగా ప్రవర్తించాడు. ఒక జర్నలిస్టు చొక్కా పట్టుకొని చింపేశాడు. దీనికి జర్నలిస్టులు తీవ్ర నిరసన తెలియజేశారు.