సియం కుమారుడికి, పేషికి ప్రమేయం: బిజెపి
కరీంనగర్: దేవాలయాల భూముల అక్రమ విక్రయాల వ్యవహారంలో ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి కుమారుడు వై.యస్. జగన్మోన్ రెడ్డి, సోదరుడు వై.యస్. వివేకానంద రెడ్డి ప్రమేయం ఉన్నదని భారతీయ జనతా పార్టీ (బిజెపి) జాతీయ కార్యదర్శి, మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ఆరోపించారు. ఈ కుంభకోణంలో ముఖ్యమంత్రి పేషికి, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డాక్టర్ కె. కేశవరావుకు, ఇతర కాంగ్రెస్ నాయకులకు కూడా పాత్ర ఉన్నదని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.
కేంద్ర మంత్రి, ఆ మంత్రి కుమారులు, బంధువులు, రాష్ట్ర మంత్రులు ఈ కుంభకోణంలో పాలు పంచుకున్నారని ఆయన అన్నారు. దేవాలయ భూముల అక్రమ విక్రయాల కుంభకోణంపై హైకోర్టు న్యాయమూర్తి చేత విచారణ జరిపించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దేవాదాయ శాఖ మంత్రి ఎం. సత్యనారాయణ రావు మీద, దేవాదాయ శాఖ అధికారుల మీద ఒత్తిడి తెచ్చి ఈ కుంభకోణానికి పాల్పడ్డారని ఆయన వ్యాఖ్యానించారు.
తెలంగాణకు అన్యాయం జరుగుతున్నా తెలంగాణ రాష్ట్ర సమితి (టి ఆర్యస్) నోరు మెదపడం లేదని ఆయన అన్నారు. తెలంగాణ సమస్యలను టి ఆర్యస్ పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. నైతిక బాధ్యత వహించి తెలంగాణ రాష్ట్ర సమితి మంత్రివర్గం నుంచి తప్పుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. టి ఆర్యస్కు, నక్సలైట్లకు మధ్య ఉన్న సంబంధం ఏమిటో చెపాలని ఆయన టి ఆర్యస్ అధ్యక్షుడు కె. చంద్రశేఖర్ రావును డిమాండ్ చేశారు.