నేను సిఫార్సు చేస్తే చేసేయడమేనా?: కెకె ప్రశ్న
హైదరాబాద్: తన సిఫార్సు వల్ల దేవాలయ భూముల అక్రమ విక్రయం నడిచిందనే ఆరోపణలపై ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డాక్టర్ కె. కేశవరావు తీవ్రంగా మండిపడ్డారు. తాను సిఫార్సు చేసినంత మాత్రాన అధికారులు నియమ నిబంధనలు చూసుకోకుండా ఇచ్చేస్తారా అని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధుల వద్ద ప్రశ్నించారు. తాను ఒక జాతీయ పార్టీకి చెందిన రాష్ట్ర శాఖ అధ్యక్షుడినని, తన వద్దకు ఎందరో వస్తుంటారని, ఎన్నో అడుగుతుంటారని, అందరినీ తృప్తి పరచడం తన బాధ్యత కాబట్టి సిఫార్సులు చేస్తుంటానని, అంత మాత్రాన దాన్ని చేసేయడం ఎలా సరైందని ఆయన అన్నారు. తిరుపతి తనకు ఇచ్చేమని రాస్తా, ఇస్తారా అని ఆయన ప్రశ్నించారు. తెలివి ఉండాలి కదా అని ఆయన అన్నారు. తాము తప్పించుకోవడానికి కొందరు వ్యక్తులు దేవాలయ భూకుంభకోణంలో తనను ఇరికిస్తున్నారని ఆయన అన్నారు.
పెనుకొండలో నైతిక విజయం తమదేనని ఆయన అన్నారు. ఫాక్షన్తో సంబంధం లేని బలహీనవర్గాలకు చెందిన వ్యక్తిని అభ్యర్థిని పోటీకి దింపి నైతిక విజయం సాధించామని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పరిటాల సునీత విజయానికి సానుభూతి పని చేసిందని, అయితే ఎంత సానుభూతి ఉన్నా మెజారిటీ గతంలో కన్నా తగ్గిందని, ఇది ఓటర్ల మొగ్గును చూపిస్తుందని ఆయన అన్నారు.