భూకబ్జాదారులపై క్రిమినల్ కేసులు: మారెప్ప
కర్నూలు: కర్నూలులో దేవాలయ భూములను అక్రమంగా ఆక్రమించుకున్నవారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని రాష్ట్ర భూగర్భ, ఎత్తిపోతల శాఖ మంత్రి మారెప్ప అధికారులను ఆదేశించారు. అక్రమ భూకబ్జాకు గురైన 12 కోట్ల రూపాయల విలువ చేసే భూములను ఆయన ఆదివారంనాడు సందర్శించారు. ఈ అక్రమ భూకబ్జాపై సమగ్ర దర్యాప్తు జరిపిస్తామని ఆయన చెప్పారు. ఆక్రమణదారుల నుంచి భూములను స్వాధీనం చేసుకోవాలని కూడా ఆయన జిల్లా ఉన్నతాధికారులను ఆదేశించారు.
ఈ భూకబ్జా వ్యవహారంలో చర్యలు తీసుకునే విషయంలో ఎన్ని రాజకీయ ఒత్తిడులు ఎదురైనా వెనక్కి తగ్గబోమని మంత్రి చెప్పారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే ఇది జరిగిందని ఆయన అన్నారు. ఈ వ్యవహారంలో రాజకీయ నాయకులు, వ్యాపారులు, ఎవరున్నా, వారు ఎంత పెద్దవారైనా చట్టపరంగా చర్యలు తీసుకునే విషయంలో వెనుకంజ వేయబోమని ఆయన చెప్పారు. భూములను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని, అందుకే తగిన చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు.