ఎమ్మెస్సార్ను క్యాబినెట్ నుంచి తప్పించండి: టిడిపి
హైదరాబాద్: దేవాలయ భూముల అక్రమ విక్రయం కుంభకోణానికి బాధ్యుడైన దేవాదాయ శాఖ మంత్రి ఎం. సత్యనారాయణ రావును మంత్రి వర్గం నుంచి తొలగించాలని తెలుగుదేశం పార్టీ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డిని డిమాండ్ చేశారు. సత్యనారాయణరావుపై, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డాక్టర్ కె. కేశవరావుపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ఆయన డిమాండ్ చేశారు.
దేవాలయ భూముల అక్రమ విక్రయంపై సమగ్ర విచారణ జరిపించాలని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇది బోఫోర్స్ కన్నా పెద్ద కుంభకోణమని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో బోఫోర్స్ కన్నా పెద్దదైన సాగునీటి ప్రాజెక్టుల టెండర్ల ఖరారు కుంభకోణం జరిగిందని, సాగునీటి ప్రాజెక్టుల కుంభకోణం స్థాయిలోనే దేవాలయ భూముల అక్రమ విక్రయం కుంభకోణం జరిగిందని ఆయన అన్నారు.