పెనుకొండలో నైతిక విజయం మాదే: వైయస్
విజయవాడ: అనంతపురం జిల్లా పెనుకొండ శాసనసభా నియోజకవర్గం ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీ గెలిచినా నైతిక విజయం తమదేనని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి అన్నారు. మొదటి రెండు విడదతలు తాము విజయం సాధించామని, తెలుగుదేశం చివరి విడత విజయం సాధించిందని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. పెనుకొండలో ఫాక్షన్ కుటుంబాలకు సంబంధం లేని వ్యక్తులను బరిలోకి దింపుదామని తాము తెలుగుదేశం పార్టీకి ప్రతిపాదించావని, తమ ప్రతిపాదన మేరకు ఫాక్షన్స్తో సంబంధం లేని సాధారణ కార్యకర్తను బరిలోకి దింపామని, ఇవి రెండు తమ విజయాలని ఆయన చెప్పారు. టిడిపి తమ ప్రతిపాదనను అంగీకరించకుండా ఫాక్షన్ కుటుంబానికి చెందిన వ్యక్తినే బరిలోకి దింపిందని ఆయన అన్నారు.
పెనుకొండలో ఫాక్షన్స్, తీవ్రవాదం కలగాపులగం అయ్యాయని, పరిటాల రవి కుటుంబానికి మావోయిస్టులతో, ఆర్వోసీతో సంబంధాలున్నాయని, ఈ విసయం తెలిసి కూడా తాము బలహీనవర్గాలకు చెందిన అభ్యర్థిని ఎన్నికల్లో పోటీకి దింపామని ఆయన అన్నారు. జయాపజయాలు సమస్య కాదని, ఎన్నిక నైతిక విలువలకు అద్దం పట్టిందని ఆయన అన్నారు. శాంతికి కట్టుబడి తాము ఫాక్షన్ కుటుంబానికి చెందినవారిని పోటీకి దింపలేదని ఆయన చెప్పారు.
ఉచిత విద్యుత్ను మరింత మంది రైతులకు అందుబాటులోకి తెస్తామని ఆయన బహిరంగ సభలో చెప్పారు. పది రోజుల లోగా పులిచింతల ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తామని ఆయన చెప్పారు. గోదావరి నదిపై తలపెట్టిన పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడమే తమ లక్ష్యమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications