ఎట్టకేలకు రాజీనామాకు సిద్ధపడిన సంతోష్ రెడ్డి
న్యూఢిల్లీ, హైదరాబాద్: మంత్రి పదవికి రాజీనామా చేయాలని తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ఎస్. సంతోష్ రెడ్డి నిర్ణయించుకున్నారు. ఢిల్లీలో తమ పార్టీ అధినేతలు కె. చంద్రశేఖర్ రావు, ఎ. నరేంద్రలతో చర్చించిన అనంతరం ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన వెంటనే తాను రాజీనామా చేస్తానని సంతోష్ రెడ్డి ఢిల్లీలో చెప్పారు. ఈ నెల 14వ తేదీన ముఖ్యమంత్రి విదేశీ పర్యటన నుంచి తిరిగి వస్తారు. ఆర్టీసి సమ్మె కారణంగానే రాజీనామాపై వెనకంజ వేశానని ఆయన చెప్పారు.
తమ నాయకుడు కె. చంద్రశేఖర్ రావుతో మాట్లాడిన తర్వాత తాను మంత్రి పదవికి రాజీనామా చేసే విషయంపై నిర్ణయం తీసుకుంటానని తెలంగాణ రాష్ట్ర సమితి (టి ఆర్యస్)కి చెందిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ఎస్. సంతోష్ రెడ్డి మంగళవారం ఉదయం ఢిల్లీకి బయలుదేరే ముందు చెప్పారు. ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి తీరుకు వ్యతిరేకంగా ప్రభుత్వం నుంచి వైదొలిగే ఉద్దేశంతో సోమవారం ఐదుగురు టి ఆర్యస్ మంత్రులు రాజీనామా చేశారు. అయితే నాయకత్వంపై తిరుగుబాటు చేసి రాజీనామా చేయడానికి సంతోష్ రెడ్డి నిరాకరించారు.
మంత్రి పదవులకు రాజీనామాలు చేసిన హరీష్ రావు, విజయరామారావు, టి. లక్ష్మీకాంతరావులతో కలిసి ఆయన మంగళవారంనాడు ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఆయన అక్కడ కెసి ఆర్తో మాట్లాడుతారు. తెలంగాణపై స్పష్టమైన హామీ ఇస్తే రాజీనామాలను ఉపసంహరించుకునే ఆలోచన చేస్తామని పౌరసరఫరాల మంత్రి విజయరామారావు చెప్పారు. తెలంగాణపై స్పష్టమైన కార్యాచరణను, ప్రణాళికను కాంగ్రెస్ ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ సమస్యను ఎప్పటి లోగా పరిష్కారం చేస్తారో కచ్చితంగా చెప్పితే తాము రాజీనామాలను ఉపసంహరించుకునే విషయంపై ఆలోచన చేస్తామని ఆయన అన్నారు.