తెలంగాణ విద్యుత్ రంగ ప్రగతి: ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్లపై దృష్టి
తెలంగాణా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యుత్ రంగంలో గణనీయమైన ప్రగతిని సాధించింది. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ కు తగ్గట్టు సప్లై చేస్తూ కరెంట్ కోతలు లేకుండా రాష్ట్రాన్ని వెలుగులతో నింపుతోంది. తాజాగా రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ కు తగ్గట్టు విద్యుత్ ఉత్పత్తి చేసేలా అనేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు తెలంగాణా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సంచలన ప్రకటన చేశారు.
సౌర, ఫ్లోటింగ్ సోలార్, ఇతర సంప్రదాయేతర ఇంధన వనరులపై ప్రత్యేక దృష్టి పెట్టింది. తెలంగాణలో విద్యుత్ వినియోగం వేగంగా పెరుగుతోంది. 2023 డిసెంబరులో రాష్ట్ర విద్యుత్ డిమాండ్ 15,000 మెగావాట్లుగా ఉండగా, 2026 సెప్టెంబరు 9 నాటికి అది 19,543 మెగావాట్లకు చేరుకుంది. పారిశ్రామిక వృద్ధి, ప్రజల కొనుగోలు శక్తి పెరగడం దీనికి కారణాలు. ఈ పెరుగుదలను తీర్చేందుకు ప్రభుత్వం ఉత్పత్తి, పంపిణీ వ్యవస్థలను బలోపేతం చేస్తోంది.

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో మాట్లాడుతూ సౌర, ఫ్లోటింగ్ సోలార్, ఇతర సంప్రదాయేతర ఇంధన వనరులపై ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. దీనిపై విద్యుత్, నీటిపారుదల శాఖలు కలిసి అధ్యయనం చేస్తున్నాయని, త్వరలోనే స్పష్టమైన ప్రకటన ఉంటుందని తెలిపింది.నాగార్జునసాగర్, శ్రీశైలం, పులిచింతల, శ్రీరామసాగర్, శ్రీపాద ఎల్లంపల్లి, దేవాదుల, కుమురంభీం, పాలేరు, వైరా, మల్లన్నసాగర్, ఎల్ఎండీ, మిడ్మానేరు, పోచారం వంటి జలాశయాల్లో ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ల ఏర్పాటు పరిశీలనలో ఉంది.
అయితే సాధారణ సోలార్ ప్రాజెక్టులతో పోలిస్తే వీటికి ఖర్చు ఎక్కువగా ఉంటుంది. కేంద్రం మెగావాట్కు రూ.కోటి వరకు సాయం ప్రకటించినా, దేశీయ పరికరాల నిబంధనల వల్ల పురోగతి ఆలస్యం అవుతోంది. ఈ నిబంధనలు సడలిస్తే పెట్టుబడులు పెరుగుతాయన్న అభిప్రాయం ఉంది . రాష్ట్రం 30లక్షల వ్యవసాయ పంపుసెట్లకు ఏడాదికి రూ.14 వేలు, 55 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్కు కలిపి సుమారు రూ.19వేల కోట్లు రాయితీగా చెల్లిస్తోంది.
ఈ భారం తగ్గించేందుకు గృహ, వ్యవసాయ వినియోగానికి ప్రత్యామ్నాయ విద్యుత్ అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో అమ్రాబాద్ గిరిజన ప్రాంతంతో పాటు 81 గ్రామాలను పూర్తి సోలార్ విద్యుత్కు మార్చనున్నారు. ఇందిరా సౌరగిరి జలవికాసం పథకం ద్వారా అటవీ హక్కుల భూముల్లో సోలార్ విద్యుత్ వినియోగ అవకాశాలు కూడా పరిశీలనలో ఉన్నాయి.
ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్లు భూమి ఆదా, నీటి ఆవిరి తగ్గింపు, పర్యావరణ అనుకూలత వంటి ప్రయోజనాలు కలిగిస్తాయి. తెలంగాణ విద్యుత్ రంగం ఈ ప్లాన్ అమలు చేస్తే స్థిరమైన, శుద్ధమైన ఇంధన భవిష్యత్తు వైపు అడుగులు వేసినట్లు అవుతుంది. రాష్ట్రంలో కరెంట్ సమస్య లేకుండా ఉంటుంది.













Click it and Unblock the Notifications
