వోక్స్ వ్యాగన్ కేసులో అశోక్ జైన్కు బెయిల్ నిరాకరణ
హైదరాబాద్: వోక్స్ వ్యాగన్ కేసులో అరెస్టయిన ఆ సంస్థ మాజీ సలహాదారు అశోక్ జైన్కు నాంపల్లి 14వ అదనపు ఛీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ సూర్యారావు బెయిల్ నిరాకరించారు. అశోక్ జైన్ను పది రోజుల పాటు కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) కస్టడీకి అప్పగిస్తూ ఆయన మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. అశోక్ జైన్ను పోలీసులు ఈ నెల 11వ తేదీన ఢిల్లీలో అరెస్టు చేసి 12వ తేదీన నాంపల్లి అదనపు ఛీఫ్ మోట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. అశోక్ జైన్కు ఈ నెల 27వ తేదీ వరకు జ్యుడిష్యల్ కస్టడీ విధిస్తూ మెజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారు.
అశోక్ జైన్ తరఫున మంగళవారం బెయిల్ పిటిషన్ దాఖలైంది. ఇదే సమయంలో అశోక్ జైన్ను తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కేసులో అశోక్ జైన్ ప్రధాన నిందితుడని, అతని వద్ద చాలా సమాచారం ఉందని, అందువల్ల ఆయనను విచారించడానికి తమ కస్టడీకి అప్పగించాలని సిబిఐ కోరింది. దీంతో అశోక్ జైన్ బెయిల్ పిటిషన్ను తోసిపుచ్చుతూ ఆయనను సిబిఐ కస్టడీకి అప్పగిస్తూ మెజిస్ట్రేట్ సూర్యారావు ఆదేశాలు జారీ చేశారు.