బేషరతుగా వస్తే నక్సల్స్తో చర్చలు: దిగ్విజయ్
హైదరాబాద్/న్యూఢిల్లీ: నక్సల్స్ బేషరతుగా వస్తే చర్చలు జరపడానికి ప్రభుత్వం ఇప్పటికీ సిద్ధమేనని కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ చెప్పారు. నక్సల్స్ దాడిలో మరణించిన శాసనసభ్యుడు సి. నర్సిరెడ్డి అంత్యక్రియల్లో పాల్గొనడానికి వచ్చిన దిగ్విజయ్ సింగ్ హైదరాబాద్లో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. నక్సల్స్తో రాజ్యాంగ పరిధిలోనే చర్చలు జరుగుతాయని ఆయన చెప్పారు. నక్సల్స్పై నిషేధం విధించే అంశం రాష్ట్రాల పరిధిలోనే ఉందని ఆయన స్పష్టం చేశారు. శాంతిభద్రతల పరిరక్షణ పేరుతో బూటకపు ఎన్కౌంటర్లు జరగకుండా జాగ్రత్త పడాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ సూచించినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో శాంతిని నెలకొల్పుతామని ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి నెరవేర్చాలని ఆయన అన్నారు.
నక్సల్స్ దాడిలో మరణించిన మున్సిపల్ కమీషనర్ రామ్మోహన్ కుటుంబానికి 9 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వనున్నట్లు హోం మంత్రి కె. జానారెడ్డి చెప్పారు. రామ్మోహన్ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని కూడా ఆయన చెప్పారు. రామ్మోహన్ అంత్యక్రియలు ఆయన స్వగ్రామంలో జరిగాయి. రామ్మోహన్ కుటుంబసభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు.
ఇదిలావుంటే, మక్తల్ శాసనసభ్యుడు సి. నర్సిరెడ్డి హత్యపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. నర్సిరెడ్డిని హత్య చేసినవారిని పట్టుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని కేంద్ర హోంమంత్రి శివరాజ్ పాటిల్ మంగళవారం రాజ్యసభలో చెప్పారు. నక్సల్స్ అణచివేతకు కేంద్రం ఆంధ్రప్రదేశ్కు అన్ని రకాల సహాయం అందిస్తుందని ఆయన చెప్పారు. నక్సల్స్ క్యాంపులను ధ్వంసం చేయాలని ఆయన నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాలను ఆదేశించారు. నర్సిరెడ్డి, మరికొంత మంది హత్యను ఆయన ఖండించారు.