ఆర్టీసిపై ఐఐయం అధ్యయనం ఖరారు: రామకృష్ణ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఎపియస్ ఆర్టీసి)పై అధ్యయనం జరిపే పనిని బెంగుళూర్కు చెందిన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐయం)కు అప్పగించినట్లు వాణిజ్య పన్నుల శాఖ మంత్రి కొణతాల రామకృష్ణ చెప్పారు. ఐ ఐయం సభ్యులు ముగ్గురు మంగళవారం ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డితోనూ, మంత్రివర్గ ఉపసంఘం సభ్యులతోనూ సమావేశమయ్యారు. ఆర్టీసి సమస్యల పరిష్కారానికి ఏర్పాటయిన మంత్రి వర్గ ఉపసంఘంలో కొణతాల రామకృష్ణ కూడా ఉన్నారు.
ఆర్టీసిని పటిష్టం చేసేందుకు ఐ ఐయం చేత అధ్యయనం చేయిస్తామని ప్రభుత్వం ఇదివరకే ప్రకటించినా మంగళవారంనాడు ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. తాము రెండు విడదతలుగా నివేదికలు సమర్పిస్తామని ఐ ఐయం ప్రతినిధులు చెప్పినట్లు రామకృష్ణ తెలిపారు. అక్టోబర్లో మొదటి నివేదిక ఇస్తామని, మరో అయిదు నెలల తర్వాత రెండో నివేదిక ఇస్తామని వారు చెప్పినట్లు ఆయన తెలిపారు. అయితే మధ్యంతర నివేదికను సాధ్యమైనంత తొందరగా, సెప్టెంబర్ నెలాఖరులోగా ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచించినట్లు ఆయన చెప్పారు.