ధన్వాడలో నర్సిరెడ్డికి అంతిమ వీడ్కోలు
హైదరాబాద్:నక్సలైట్ల కాల్పుల్లో మృతి చెందినకాంగ్రెస్ ఎమ్మెల్యే నర్సిరెడ్డిఅంత్యక్రియలు మంగళవారం మధ్యాహ్నంమహబూబ్ నగర్ జిల్లా ధన్వాడలో అధికార లాంచనాలతో జరిగాయి. నర్సిరెడ్డి అంత్యక్రియలతో పాటు ఆయన కుమారుడు వెంకటేశ్వర రెడ్డి అంత్యక్రియలు కూడా జరిగాయి. అంత్యక్రియలకు ఎఐసిసి తరఫునకాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ దిగ్విజయ్ సింగ్ హాజరయ్యారు. ఇంకాహోంమంత్రి జానారెడ్డి, పిసిసిఅధ్యక్షుడు కేశవరావు, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు వెంకటస్వామి తదితరులు అంత్యక్రియలకు హాజరయ్యారు. నక్సల్స్ చర్యను వెంకటస్వామి ఖండించారు. నర్సిరెడ్డితో తనకు గల అనుబంధాన్ని ఆయన నెమరేసుకున్నారు. నర్సిరెడ్డి అంత్యక్రియలకుటిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుహాజరు కావాలనుకున్నా భద్రతాకారణాల వల్ల ఆ కార్యక్రమాన్ని రద్దుచేసుకున్నారు. మహబూబ్నగర్ పార్లమెంటు సభ్యుడు విఠల్ రావు అంత్యక్రియలను దగ్గరుండి పర్యవేక్షించారు.
అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఎఐసిసి) అధ్యక్షురాలు సోనియా గాంధీ తన సంతాప సందేశాన్ని పంపారు. హోం మంత్రి కె. జానారెడ్డి ఆ సంతాప సందేశాన్ని చదివి వినిపించారు. నర్సిరెడ్డి మరణంతో ఒంటరిభావనకు గురి కావద్దని ఆయన కుటుంబసభ్యులకు తెలియజేస్తూ తామంతా నర్సిరెడ్డి కుటుంబానికి అండగా ఉంటామని ఆమె చెప్పారు. నర్సిరెడ్డి అంత్యక్రియలకు హాజరైన జానారెడ్డి మంత్రివర్గ సమావేశంలో పాల్గొనడానికి వెంటనే హైదరాబాద్ వచ్చారు.
నర్సిరెడ్డి అంత్యక్రియల్లో పాల్గొనడానికి బయలుదేరిన స్పీకర్ సురేష్ రెడ్డి కారు మార్గమధ్యంలో స్వల్ప ప్రమాదానికి గురైంది. దీంతో ఆయన మరో కారులో ధన్వాడకు బయలుదేరి వెళ్లారు. ధన్వాడలో ఉద్వేగభరిత వాతావరణం నెలకొంది. నక్సలైట్లకు వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఐజి మీనాను ఘెరావ్ చేసేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నించారు.