నిరంతరాయంగా ఏడు గంటలు విద్యుత్: వైయస్
హైదరాబాద్: వ్యవసాయానికి నిరంతరాయంగా ఏడు గంటల విద్యుత్ను అందించాలని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వ్యవసాయానికి విద్యుత్ సరఫరాపై ప్రతి రోజు సమీక్ష జరపాలని కూడా ఆయన ఆదేశించారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన సోమవారం మంత్రివర్గం సమావేశం జరిగింది. రాత్రిపూట కాకుండా పగలే వ్యవసాయానికి విద్యుత్ సరఫరా చేయాలనే డిమాండ్పై మంత్రివర్గం ఏ నిర్ణయమూ తీసుకోలేదు.
వారం రోజుల పాటు జరిగిన ప్రజాపథం కార్యక్రమంపై మంత్రివర్గంలో విస్తృతంగా చర్చ జరిపినట్లు తెలుస్తోంది. ఏడు లక్షల వ్యవసాయ పంపుసెట్లకు కెపాసిటర్లు బిగించుకున్నట్లు తెలియజేస్తూ మిగతా రైతులు కూడా కెపాసిటర్లు బిగించుకునేట్లు చూడాలని మంత్రి వర్గం అభిప్రాయపడింది. రాష్ట్రంలోని పది వైద్య కళాశాలల్లో 600 రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ల పోస్టులను భర్తీ చేయాలని మంత్రి వర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అదే విధంగా కడప జిల్లా పుట్లంపల్లిలో రామకృష్ణ మిషన్కు భూమి కేటాయిస్తూ మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది.