హుడాది మాఫియా పాత్ర: దత్తాత్రేయ
హైదరాబాద్: హైదరాబాద్ పట్టణాభివృద్ధి సంస్థ (హుడా) మాఫియా లాగా మారిందని భారతీయ జనతా పార్టీ (బిజెపి) జాతీయ కార్యదర్శి బండారు దత్తాత్రేయ వ్యాఖ్యానించారు. పత్రికా స్వేచ్ఛను అడ్డుకునే ప్రయత్నం చేయడం తగదని ఆయన గురువారం ప్రభుత్వానికి సలహా ఇచ్చారు. ఈనాడు దినపత్రికలోని వార్తాకథనాలను ప్రశ్నిస్తూ హుడా పూర్తి పేజీ ప్రకటన ఇవ్వడాన్ని ప్రస్తావిస్తూ ఆయన ఆ సూచన చేశారు. అవుటర్ రింగ్ రోడ్డులో భాగంగా ఈనాడు దినపత్రిక అధిపతి రామోజీరావు కుమారుడు కిరణ్ పేర గల భూమి పోతోందని, దాన్ని కాపాడుకోవడానికే ఈనాడు దినపత్రికలో తమపై వార్తా కథనాలు రాస్తున్నారని హుడా ఆ వాణిజ్య ప్రకటనలో అన్నది.
హుడా మనుగడను మంట గలిపే పద్ధతిలో ప్రభుత్వం వ్యవహరిస్తోందని, ఇది చాలా బాధాకరమని దత్తాత్రేయ అన్నారు. సమాచారం తెలుసుకునే హక్కు ప్రజలకు వుందని, దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించడం సరి కాదని ఆయన అన్నారు. హుడా వాణిజ్య ప్రకటన ఈనాడుకు మాత్రమే కాకుండా తమకు వ్యతిరేకంగా రాస్తే చూసుకుంటామనే హెచ్చరికలా వుందని ఆయన వ్యాఖ్యానించారు.