వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మన్మోహన్‌, సోనియాలతో కెసిఆర్‌ భేటీ

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధినేత, కేంద్ర కార్మిక శాఖ మంత్రి కె. చంద్రశేఖర రావు గురువారంనాడు ప్రధాని డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌, కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీలతో సమావేశమయ్యారు. ఈ సమావేశం ప్రధాని నివాసంలో జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్‌ అధిష్ఠానం నుంచి స్పష్టమైన ప్రకటన కోసం తెరాస ఈ నెల 15వ తేదీని డెడ్‌లైన్‌గా విధించిన నేపథ్యంలో ఈ సమావేశం జరిగింది. సోనియా, మన్మోహన్‌లతో చంద్రశేఖర రావు దాదాపు 45 నిమిషాల పాటు మాట్లాడారు. ఈ సమావేశంలో తెలంగాణపై ఏర్పాటయిన యుపిఎ సబ్‌ కమిటీ చైర్మన్‌ ప్రణబ్‌ ముఖర్జీ కూడా పాల్గొన్నారు. తెలంగాణపై కాంగ్రెస్‌ తన వైఖరిని పార్టీ అత్యున్నత నిర్ణాయక సంస్థ సిబ్ల్యుసిలో ప్రవేశపెట్టి స్పష్టం చేయాలని, అదే విధంగా ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికలో హామీ ఇచ్చిన మేరకు తెలంగాణపై యుపిఎ వైఖరిని స్పష్టం చేయాలని చంద్రశేఖర రావు కోరినట్లు సమాచారం. తెలంగాణ ఏర్పాటు విషయంలో జరుగుతున్న తాత్సారం వల్ల తమ ఉనికికే ప్రమాదం ఏర్పడిందని, ఇక వేచి వుండడం సాధ్యం కాదని చంద్రశేఖర రావు సోనియాకు, మన్మోహన్‌కు తెలియజేసినట్లు చెబుతున్నారు.

అయితే సమావేశంలో చాలా వరకు చంద్రశేఖర రావు నిర్వహిస్తున్న కార్మిక శాఖ వ్యవహారాలపైనే సాగినట్లు తెలుస్తోంది. చంద్రశేఖరరావు పని చేయడం లేదంటూ సిపియం నాయకుడు గురుదాస్‌ దాస్‌గుప్తా పదే పదే విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సమావేశం జరిగిందని భావిస్తున్నారు. కాగా, తెలంగాణపై ప్రణబ్‌ ముఖర్జీ కమిటీ నివేదిక కోసం చంద్రశేఖరరావు సమావేశంలో పట్టుబట్టినట్లు చెబుతున్నారు. సమావేశానంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడకుండానే చంద్రశేఖర రావు వెళ్లిపోయారు. చంద్రశేఖరరావు వెళ్లిపోయిన తర్వాత కాసేపు మన్మోహన్‌, సోనియా, ప్రణబ్‌ ముఖర్జీలు సమావేశమయ్యారు. ఈ సమావేశం వివరాలు కూడా తెలియడం లేదు. సమావేశానంతరం ప్రణబ్‌ ముఖర్జీ కూడా మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X