కెసిఆర్తో సోనియా ఫోన్ మంతనాలు
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అగ్రనేత, కేంద్ర మంత్రి కె. చంద్రశేఖరరావును బుజ్జగించేందుకు కాంగ్రెస్ నాయకత్వం రంగంలోకి దిగింది. సోమవారం సాయంత్రం ఐదు గంటలకు కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ వ్యవహారా ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ సమావేశమయ్యారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఫోన్ చేసి కెసిఆర్తో మాట్లాడారు. ఆ సమయంలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డాక్టర్ కె. కేశవరావు కెసిఆర్ వద్దనే వున్నారు. కేశవరావు సమక్షంలోనే కెసిఆర్ సోనియాతో మాట్లాడారు. గంటకుపైగా కేశవరావు కెసిఆర్తో భేటీ అయ్యారు. అయితే భేటీ అనంతరం కేశవరావు మీడియా ప్రతినిధులతో ఏమీ మాట్లాడకుండానే వెళ్లిపోయారు. తమ డెడ్లైన్ను కెసిఆర్ వెనక్కి తీసుకోకపోవడానికి ఏ మాత్రం ఇష్టపడటం లేదని తెలుస్తోంది.
అనంతరం కేశవరావు సోనియా గాంధీని కలిశారు. సోనియా గాంధీ సమావేశం కోసం కెసిఆర్ను ఆహ్వానించారు. సోమవారం రాత్రి 9 గంటలకు కెసిఆర్లో సోనియా దూతలు సమావేశమవుతారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్, సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ పాల్గొంటారు. ఎన్సిపి నేత శరద్పవార్ తరఫున ఆ పార్టీ అధికార ప్రతినిధి త్రిపాఠి చంద్రశేఖరరావును కలిశారు. హామీ మేరకు తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాలని త్రిపాఠి డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలు మోసపోయింది చాలునని, ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ఇవ్వడం న్యాయమని ఆయన అన్నారు. తెరాస యుపిఎలో కొనసాగాలని తాము కోరుకుంటున్నామని ఆయన చెప్పారు. జంతర్మంతర్ వద్ద తెరాస ధర్నాకు పోలీసుల అనుమతి లభించింది. చంద్రశేఖరరావు జంతర్మంతర్ వద్ద నిరాహార దీక్ష ప్రారంభించే సమయానికి తల్లి తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు విజయశాంతి అక్కడికి చేరుకునే అవకాశం వుంది. విజయశాంతి తమతో కలిస్తే ఆహ్వానిస్తామని, అలా కలవడం వల్ల ఉద్యమం బలోపేతం అవుతాయని తెరాస అధికార ప్రతినిధి వి. ప్రకాశ్ మీడియా ప్రతినిధులతో అన్నారు.