ఢిల్లీకి విజయశాంతి: కెసిఆర్ దీక్షకు ఏర్పాట్లు
న్యూఢిల్లీ/ హైదరాబాద్: తెలంగాణ సాధన కోసం పోరాటానికి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నేతలు సిద్ధమవుతున్న తరుణంలో తల్లి తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు, సినీనటి విజయశాంతి ఢిల్లీకి వస్తున్నారు. తెరాస నాయకులకు ఆమె తన మద్దతును తెలియజేసే అవకాశం వుంది. తమ పార్టీ నేతలిద్దరూ ఈ నెల 22వ తేదీ రాత్రి రాజీనామాలు సమర్పిస్తారని, 23వ తేదీన తమ నేత కె. చంద్రశేఖరరావు ఆమరణ నిరాహార దీక్ష చేపడుతారని తెరాస ప్రధాన కార్యదర్శి వి. ప్రకాష్ ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో చెప్పారు.
ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద చంద్రశేఖరరావు నిరాహార దీక్ష చేయడానికి స్థలాన్ని పరిశీలించి ఏర్పాట్లు చేస్తున్నామని, అందుకు అధికారుల అనుమతి తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. హైదరాబాద్ నుంచి తెరాస యువజన విభాగం కార్యకర్తలు రైలులో ఢిల్లీకి బయలుదేరి వెళ్తున్నారు. తెలంగాణ సాధన కోసం హైదరాబాద్లో తెలంగాణ ఐక్య కార్యాచరణ వేదిక ఆధ్వర్యంలో సోమవారం ర్యాలీ జరిగింది. అనంతరం ఇందిరాపార్కు వద్ద ధర్నా జరిగింది. తెరాస అగ్రనేతలు మంత్రి పదవులకు రాజీనామా చేసి, యుపిఎ నుంచి వైదొలగాలని విజయశాంతి చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు.