రాజగోపాల్పై దాడి జరగనేలేదు: కేశవరావు
హైదరాబాద్: విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మీద నిన్న ప్రెస్ క్లబ్ వద్ద అసలు దాడి జరగలేదని, అదంతా మీడియా సృష్టి అని పిసిసి అధ్యక్షుడు కేశవరావు మంగ ళవారం ఒక విచిత్రమైన ప్రకటన చేశారు. కానీ తెలంగాణ విద్యార్ధి నాయకులు ఆయన మీద దాడి చేసిన సన్నివేశాలను జనం టీవీ ఛానల్స్లో చూసిన విషయాన్ని కేశవరావు ఏ విధంగా కాదంటున్నారో అర్ధం కావడం లేదు. రాజగోపాల్ను తెలంగాణ విద్యార్ధులు వీపుమీద పిడి గుద్దులు వేశారని స్పాట్లో ఉన్న మీడియా ప్రతినిధులు చెబుతున్నారు. కొన్ని దృశ్యాలు టీవీ ఛానల్స్లో ప్రసారమయ్యాయి కూడా. రాజగోపాల్ నిరసన దీక్షను విరమింపచేయడానికి నిన్న ఆ ప్రదేశానికి వెళ్ళిన కేశవరావు మాటను రాజగోపాల్ వినలేదు. దానితో కేశవరావు కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇలా ఉండగా తన వాదనను అధిష్టానవర్గానికి విన్పించడానికి రాజగోపాల్ నేడు ఢిల్లీకి బయలుదేరి వెళ్ళారు.