తెలంగాణ అంగీకరిస్తే పోటీ చేయను: కెసిఆర్
నిజామాబాద్/ కరీంనగర్: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు అంగీకరిస్తూ కాంగ్రెస్ ప్రకటన చేస్తే కరీంనగర్ లోక్సభ ఉప ఎన్నిక నుంచి తప్పుకుంటానని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు చెప్పారు. అంతేకాకుండా కరీంనగర్ లోక్సభ ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తానని ఆయన అన్నారు. కరీంనగర్ జిల్లా మెట్పల్లి నుంచి ఆయన తన ఎన్నికల ప్రచారాన్ని మంగళవారంనాడు ప్రారంభించారు. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి బ్యాండు మేళాన్ని ఎదుర్కోవడం కష్టమేమీ కాదని ఆయన కరీంనగర్కు వెళ్తూ నిజామాబాద్లో మీడియా ప్రతినిధులతో అన్నారు.
తమతో పొత్తు పెట్టుకుంటేనే నిజమైన తెలంగాణ వారసులమని అనుకోవాల్సి వుంటుందని ఎన్నికల సమయంలో కాంగ్రెస్వారు అన్నారని, లేదంటే తెలుగుదేశం పార్టీ ఏజెంటు అనుకోవాల్సి వస్తుందని అన్నారని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలు, శాసనసభ, లోక్సభ అభ్యర్థులు మొదలుకొని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రస్తుత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి గులాబీ కండువా కప్పుకొని ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని, అదంతా అవసరం కొద్దీ ఓట్ల కోసం చేశారని, ఇప్పుడేమో నానా యాగీ చేస్తున్నారని ఆయన అన్నారు.