సొరాబ్జిది తప్పో ఒప్పో చెప్పలేను: రోశయ్య
సంగారెడ్డి: గౌరు వెంకటరెడ్డికి క్షమాభిక్ష ప్రసాదించిన కేసుకు మంత్రివర్గం బాధ్యత వహించాల్సి వుంటుందని న్యాయ కోవిదుడు సోలి సొరాబ్జి చేసిన వ్యాఖ్యపై న్యాయనిపుణుల సలహా తీసుకోవాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకున్న విషయం నిజమేనని ఆర్థిక, వైద్య ఆరోగ్య మంత్రి కె. రోశయ్య చెప్పారు. న్యాయ నిపుణుల సలహా తీసుకోకుండా సొరాబ్జి వ్యవహరించిన తీరు తప్పో ఒప్పో తాను చెప్పలేనని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.
ఒక రాజకీయ పార్టీ నాయకుడి పక్కన కూర్చుని సోలి సొరాబ్జి ఆ విధంగా మాట్లాడవచ్చా, లేదా అనేది న్యాయనిపుణుల సలహా తీసుకుంటే తప్ప ఏమీ చెప్పలేమని ఆయన అన్నారు. ఎమిస్క్యూరీ అయిన సొరాబ్జి బహిరంగంగా ఆ విధమైన ప్రకటన చేయవచ్చునా, లేదా అనేది కూడా తనకు తెలియదని ఆయన అన్నారు. ఖాళీగా వున్న 1809 వైద్యుల పోస్టులను, 1201 స్టాఫ్ నర్సుల పోస్టులను త్వరలో భర్తీ చేస్తామని ఆయన చెప్పారు.