క్యాబినెట్లో బిసిలకు తగిన చోటుకు యాష్కీ డిమాండ్
హైదరాబాద్: కేంద్ర మంత్రివర్గంలో వెనుకబడిన తరగతులకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలని కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు మధుయాష్కీ గౌడ్ విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన బిసీలకు కేంద్ర మంత్రి వర్గంలో తగిన ప్రాతినిధ్యం కల్పించకపోతే మూల్యం చెల్లించక తప్పదని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. రాష్ట్రంలోని బిసిలు అండగా నిలిచి కాంగ్రెస్ను గెలిపించారని, అటువంటప్పుడు తగిన ప్రాతినిధ్యం కల్పించడం లేదనే భావన పార్టీని దెబ్బ తీస్తుందని ఆయన అన్నారు.
బిసిలకు తగిన ప్రాతినిధ్యం ఇవ్వకపోవడం వల్లనే బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో పార్టీ బలహీనపడిందని, ఆ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో రాకూడదంటే బిసిలకు తగిన ప్రాతినిధ్యం కల్పించడం అవసరమని ఆయన అన్నారు. సమాజంలో 50 శాతం వున్న బిసిలు అన్ని రంగాల్లో తగిన ప్రాతినిధ్యం ఆశించడం అనివార్యమని, ఈ విషయాన్ని మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ విషయంలోనూ గుర్తించడం అవసరమని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నుంచి వలసల వల్ల కాంగ్రెస్ పార్టీకి పెద్దగా ప్రయోజనం వుండదని ఆయన అభిప్రాయపడ్డారు.