జల ప్రళయాన్ని కళ్ళారా చూసిన కేంద్ర హోంమంత్రి
విజయవాడ: వర్షాలవల్ల రాష్ట్రానికి కల్గిన నష్టం అపారంగా ఉందని, ఈ ప్రాంతాలలో ఎల్లుండి కేంద్ర బందం పర్యటించి నష్టాన్ని అంచనా వేస్తుందని కేంద్ర హోం మంత్రి శివరాజ్పాటిల్ హామీ ఇచ్చారు. నష్టం వివరాలను ప్రధానికి, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి వివరిస్తానని ఆయన తెలిపారు. బంగాళాఖాతంలో అల్పపీడనం, రుతుపవనాల వర్షాలవల్ల ప్రజలు ఇక్కట్ల పాలైన కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలలోని ప్రాంతాలను కేంద్ర హోంమంత్రి శివరాజ్పాటిల్ విమానంలో సంద ర్శించారు. ఢిల్లీనుంచి నేరుగా గన్నవరం చేరుకున్న శివరాజ్పాటిల్ అక్కడినుంచి మొదట మచిలీపట్నం, కృష్ణాజిల్లాలోని పలు ప్రాంతాలను సందర్శించారు. కేంద్రహోంమంత్రి వెంట ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఉన్నారు.
మచిలీపట్నంలో వర్షాలు కురిసి వారంరోజులైనా ఇప్పటికీ నీటిలో ఉన్న ప్రాంతాలను కేంద్ర హోం మంత్రి సందర్శించారు. మచిలీపట్నంలో హౌసింగ్బోర్డు కాలనీలో ఇప్పటికీ వర్షం నీరు ఇళ్ళలో ఉంది. రోడ్లు,ఇళ్ళు ఏకమైపోయినట్లుఉంది. రాష్ట్రంలో నాలుగు జిల్లాలలో పది లక్షల ఎకరాలలో పంటనష్టమైందని, కష్ణాజిల్లాలోనే 6 లక్షల ఎకరాలలో పంట నష్టం జరిగిందని ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డి వివరించారు. రాష్ట్రంలో పంటనష్టం 1600 కోట్ల పైనే ఉందని ఆయన కేంద్రమంత్రికి తెలిపారు.