మార్గదర్శి చట్ట విరుద్ధం, మూసేయాలి: ఉండవల్లి
హైదరాబాద్: ఈనాడు గ్రూపు సంస్థల అధిపతి రామోజీరావు నేతృత్వంలోని మార్గదర్శి ఫైనాన్షియర్స్ చట్టవిరుద్ధంగా నడుస్తోందని, దాన్ని మూసివేయాల్సిందేనని కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన ఆదివారంనాడు మరోసారి రామోజీ రావుపై ధ్వజమెత్తారు. తరుచుగా మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి విమర్శలు చేయడం ఎందుకని తాను 6 నెలల క్రితమే మార్గదర్శిపై అధికారులకు ఫిర్యాదు చేశానని ఆయన చెప్పారు. తాను చేసిన ఫిర్యదుపై అధికారులు ఏ విధమైన చర్యలూ తీసుకోలేదని ఆయన అన్నారు.
సత్యం బయట పెట్టినందుకు దారుణంగా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. తాను రాజకీయ నాయకుడనని, తాను ఒక వేళ న్యాయవాదిని అయి ఉంటే మార్గదర్శి పట్ల తాను వ్యవహరించే పద్ధతి వేరుగా ఉండేదని ఆయన అన్నారు. ఎపి చిట్ ఫండ్స్ చట్టం ప్రకారం చిట్టీ పాడకున్నవారి డబ్బులను జాతీయ బ్యాంకులో డిపాజిట్ చేయాలని, సూరిటీ ఇవ్వడానికి ఎవరూ ముందుకు రాకపోతే ఆ డబ్బులు చిట్టీ కాలపరిమితి ముగిసే వరకు బ్యాంకులోనే ఉండాలని, మార్గదర్శి అలా డబ్బులు ఎక్కడా డిపాజిట్ చేయలేదని ఆయన వివరించారు. వామపక్షాలు, తెలంగాణ రాష్ట్ర సమితి తమకు ఇంకా మిత్రపక్షాలేనని, తాము ప్రత్యేక తెలంగాణకు వ్యతిరేకం కాదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications