బిజెపితో చర్చల ప్రసక్తే లేదు: కుమారస్వామి
బెంగుళూర్: భారతీయ జనతా పార్టీ (బిజెపి)తో ఇక చర్చలు జరిపే ప్రసక్తి లేదని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జెడి-ఎస్ నాయకుడు కుమారస్వామి చెప్పారు. తమ డిమాండ్లకు అంగీకరించనందు వల్లనే తాము బిజెపికి మద్దతు ఉపసంహరించుకున్నామని ఆయన సోమవారం శాసనసభ సమావేశాలకు వెళ్తూ మీడియా ప్రతినిధులతో చెప్పారు. తమ షరతులను అంగీకరించనందు వల్లనే తాము బిజెపికి మద్దతు ఉపసంహరించుకున్నామని అంతకుముందు జెడి - ఎస్ నేత దేవెగౌడ చెప్పారు. చర్చలకు ముఖ్యమంత్రి యడ్యూరప్ప నుంచి ఏ విధమైన సుముఖత రాలేదని ఆయన చెప్పారు. తమ షరతులతో కూడిన ఒప్పందంపై సంతకం చేయడానికి అంగీకరించలేదని, శ్రీరాములును తిరిగి మంత్రివర్గంలోకి తీసుకుంటామని చెబుతున్నారని ఆయన అన్నారు.
జెడి - ఎస్ నమ్మకద్రోహం చేసిందని బిజెపి జాతీయాధ్యక్షుడు రాజ్ నాధ్ సింగ్ సోమవారం ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో చెప్పారు. తమకు బేషరతుగా మద్దతు ఇవ్వడానికి జెడి - ఎస్ ముందుకు వచ్చిందని, ఇప్పుడు షరతులు పెడుతోందని ఆయన అన్నారు. కర్ణాటకలో ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామని గతంలో చెప్పామని, ఇప్పుడు కూడా సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు. ఇదిలా ఉంటే, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో చర్చలు జరపడానికి దేవెగౌడ ఢిల్లీ బయలుదేరి వెళ్లారు.












Click it and Unblock the Notifications