ఓడితే మధుయాష్కీ అమెరికాకే: మారెప్ప
హైదరాబాద్: అడిగిన వెంటనే ఇవ్వడానికి తెలంగాణ బీడీ సిగరెట్టు కాదని రాష్ట్ర మంత్రి మారెప్ప అన్నారు. తాను తాగుబోతునని రుజువు చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఆయన కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు మధుయాష్కీని సవాల్ చేశారు. విశ్వవిద్యాలయానికి వెళ్లి విద్యార్థులను చెడగొట్టదలుచుకోలేదని ఆయన ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వస్తే తెలంగాణ ఆకాంక్ష ఎంత బలంగా ఉందో తెలుస్తుందని మధుయాష్కీ చేసిన ప్రకటనపై అన్నారు. ఎన్నికల్లో ఓడిపోతే మధుయాష్కీ అమెరికాకే పయనం కడతారని ఆయన వ్యాఖ్యానించారు.
దమ్ముంటే నిజామాబాదులో పెట్టే ఓ సభకు రావాలని ఆయన మధుయాష్కీని సవాల్ చేశారు. వైయస్ పాలనలో అభివృద్ధి జరుగుతోందని అందరూ అంగీకరిస్తున్నారని, ఏమన్నా అంటే అవినీతి అంటున్నారని, ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడును ఎవరూ ఏమీ అనరని ఆయన అన్నారు. వచ్చే ఐదేళ్లలో అవసరమైతే తెలంగాణ తీసుకోవచ్చుననేది తన అభిమతమని ఆయన అన్నారు. తాను తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని, తాను రాష్ట్రమంతటికీ మంత్రినని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications