వైయస్ రెచ్చగొడుతున్నారు: కెసిఆర్
వరంగల్: డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ప్రకటనల వల్లనే తమ పార్టీ కార్యకర్తలు రెచ్చిపోతున్నారని, అందుకు బాధ్యత వహించాల్సింది రాజశేఖరరెడ్డేనని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు అన్నారు. రాజశేఖర రెడ్డి చేసిన ప్రకటన వల్ల ఆవేశానికి గురై తమ కార్యకర్తలు మంత్రులను ఘెరావ్ చేస్తున్నారని ఆయన గురువారం వరంగల్లు జిల్లా జనగామలో మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణ నినాదంపై గెలిచిన ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బ తినేలా ప్రకటనలు చేస్తున్నారని ఆయన విమర్శించారు.
తెలంగాణ సాధనకు చేరువలో ఉన్నామని, సంయమనం పాటించాలని ఆయన కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. మంత్రులు ప్రకటనలు తెలంగాణ ప్రజలను రెచ్చగొడుతున్నాయని ఆయన అన్నారు. ఈ టర్మ్ లో తెలంగాణ సాధ్యం కాదని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ప్రకటన చేసినప్పటి నుంచి తెరాస కార్యకర్తలు తెలంగాణలో మంత్రులు ఘెరావ్ చేస్తున్నారు. మంత్రులు జి. చిన్నారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఫరీదుద్దీన్, దామోదరం రాజనర్సింహ, ముఖేష్ వంటి మంత్రులను తెరాస కార్యకర్తలు ఇప్పటి వరకు ఘెరావ్ చేశారు.












Click it and Unblock the Notifications