కాంగ్రెస్ పతనమే ధ్యేయం: కెసిఆర్
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వ పతనమే తమ ధ్యేయమని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు అన్నారు. కరీంనగర్ జిల్లా కమలాపూర్ నియోజకవర్గం అంబాలా నుంచి ఆయన ఆశీర్వాద యాత్రను ప్రారంభించారు. ఆయన రోడ్డు షో చేస్తూ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తున్నారు. మూడు చోట్ల బహిరంగ సభలను కూడా ఏర్పాటు చేశారు. తెలంగాణపై కాంగ్రెస్ వైఖరిని విమర్శిస్తూ శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, పార్లమెంటు సభ్యులు రాజీనామాలు చేయడానికి ముందు ప్రజలకు వివరణ ఇవ్వడానికి ఆయన ఈ ఆశీర్వాద యాత్రను తలపెట్టారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి అడ్డు పడుతున్నారని ఆయన విమర్శించారు. తాము రాజీనామాలు చేసి ఉప ఎన్నికలు జరిగితే అందుకు కాంగ్రెస్ బాధ్యత వహించాలని ఆయన అన్నారు. ఉప ఎన్నికల్లో కరీంనగర్ లోకసభ ఉప ఎన్నిక ఫలితాన్ని పునరావృతం చేయాలని ఆయన ప్రజలను కోరారు. తమ రాజీనామాల నిర్ణయంపై ఆయన ప్రజల నుంచి ప్రతిస్పందనను కోరుతున్నారు. వరంగల్ జిల్లాలోని సమ్మక్క సారలక్కలకు పూజలు నిర్వహించిన అనంతరం ఆయన ఈ యాత్రను ప్రారంభించారు.












Click it and Unblock the Notifications