తెరాస రాజీనామాలపై దుమారం
హైదరాబాద్: తాము రాజీనామాలు చేసే సమయంలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యులు
మంగళవారం చేసిన విమర్శలకు వివరణ ఇచ్చేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నాన్ని ప్రతిపక్షాల సభ్యులు అడ్డుకున్నారు. తెరాస సభ్యులు రాజీనామాలు చేసి వెళ్లి పోయిన తర్వాత వివరణ ఇవ్వడం సరి కాదని ప్రతిపక్షాలు సభ్యులు వాదించారు. తెరాస సభ్యుల రాజీనామాలను ఇంకా ఆమోదించనందున ప్రభుత్వం వివరణ ఇవ్వవచ్చునని శాసనసభా వ్యవహారాల మంత్రి కె. రోశయ్య అన్నారు. తమపై చేసిన ఆరోపణలకు వివరణ ఇచ్చేందుకు తమకు హక్కు ఉందని ప్రభుత్వ చీఫ్ విప్ కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.
తెరాసకు 16 మంది శాసనసభ్యులు రాజీనామా చేస్తున్న సమయంలో ముఖ్యమంత్రి సభలో ఉండి మధ్యలో జోక్యం చేసుకుని తాము మోసం చేయలేదని చెప్పి ఉంటే బాగుండేదని, వారు రాజీనామాలు చేసిన తర్వాత చర్చ చేయడం సరి కాదని తెలుగుదేశం శాసనసభా పక్ష ఉప నాయకుడు దేవేందర్ గౌడ్ అన్నారు. తెరాస సభ్యుల రాజీనామాలపై సభలో ప్రభుత్వం వివరణ ఇవ్వకూడదని, కావాలంటే సభ వెలుపల ఇచ్చుకోవచ్చునని సిపియం శాసనసభా పక్ష నాయకుడు నోముల నర్సింహయ్య అన్నారు. ప్రభుత్వ వివరణకు అవకాశం ఉండకూడదని సిపిఐ శాసనసభా పక్ష నాయకుడు చాడ వెంకటరెడ్డి అన్నారు. అధికార పక్ష సభ్యులకు అవకాశం ఇచ్చేందుకు స్పీకర్ కె.ఆర్. సురేష్ రెడ్డి ప్రయత్నించారు. అయితే ప్రతిపక్షాల సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు.
ఇది సంతోషకరమైన రోజు ఏమీ కాదని, తాము విషయాలను సరైన రీతిలో పెట్టదలుచుకున్నామని ఉన్నత విద్యాశాఖ మంత్రి డి. శ్రీనివాస్ అన్నారు. మంత్రిని అడ్డుకునేందుకు ప్రతిపక్షాల సభ్యులు ప్రయత్నించారు. దీంతో ప్రతిపక్షాల సభ్యులు నినాదాలు చేస్తూ అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇది గాంధీభవన్ కాదని ప్రతిపక్షాల సభ్యులు అన్నారు. ఇది తమకు, తెరాసకు సంబంధించిన విషయమని, వారు తమపై కొన్ని ఆరోపణలు చేశారని, వాటికి వివరణ ఇవ్వడం తమ బాధ్యత అని మంత్రి అన్నారు. స్పీకర్ ఎంతగా సర్దిచెప్పినప్పటికీ ప్రతిపక్షాల సభ్యులు వినలేదు. తెలంగాణపై తెలుగుదేశం తన వైఖరి వెల్లడించలేదని మంత్రి రోశయ్య అన్నారు. తెరాస సభ్యులు కొన్ని ఆరోపణలు చేశారని, వాటికి వివరణ ఇవ్వదలుచుకున్నామని, దానికి అడ్డు తగిలితే సస్పెండ్ చేయక తప్పదని ఆయన అన్నారు. తెలుగుదేశం సభ్యులు నిలబడి నిరసన తెలియజేశారు.












Click it and Unblock the Notifications