శ్రీలతకు బెయిల్: వెంకటరెడ్డికి నో
చెన్నై: నకిలీ వీసాల కేసులో హైదరాబాదుకు చెందిన శ్రీలతకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. వెంకటరెడ్డికి మాత్రం బెయిల్ నిరాకరించింది. ఈ కేసులో మరో నిందితురాలైన సినీ నటి ఆశాషైనీకి మద్రాసు హైకోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఆశాషైనీతో పాటు నకిలీ వీసాల కేసులో శ్రీలత, వెంకటరెడ్డి పట్టుబడ్డారు. ఆశాషైనీతో పాటు హైదరాబాదుకు చెందిన శ్రీలతను అమెరికాకు పంపడానికి వెంకటరెడ్డి నకిలీ ధ్రువపత్రాలతో ఒప్పందం కుదిర్చినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ వాదనను వెంకటరెడ్డి ఖండిస్తున్నాడు.
శ్రీలత ద్వారానే తనకు ఆశాషైనీ పరిచయమైందని అతను ఒక ప్రైవేట్ టీవీ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. తాను 18 ఏళ్లుగా సినీ పరిశ్రమలో ఉన్నానని, ఎంతో మంది తారలకు మేనేజరుగా పని చేశానని అతను చెప్పాడు. తెలుగు సినీ తారలకు అమెరికాలోని ఒక తెలుగు సంఘం వీసాలు ఇప్పించడంలో సాయపడుతోందని అతను చెప్పాడు. తాను నోరు విప్పితే చాలా మంది పేర్లు బయటకు వస్తాయని అతను అంటున్నాడు. తెలుగు సినీ పరిశ్రమ తనకు అన్నం పెట్టిందని, అందుకే వారి పేర్లను వెల్లడించడం లేదని అతను అన్నాడు. ఆశాషైనీ విషయంలో తెలుగు సినీ పరిశ్రమలోని ఎవరికీ సంబంధం లేదని అతను చెప్పాడు.












Click it and Unblock the Notifications