మరో పది మంది అవినీతి ఐఎఎస్ లు
హైదరాబాద్: మరో పదిమంది అవినీతి ఐఎఎస్ అధికారుల జాబితాను రాష్ట్ర ప్రభుత్వం మంగళవారంనాడు హైకోర్టుకు సమర్పించింది. సమాచార చట్టం హక్కు కింద అవినీతి అధికారుల జాబితాను తనకు అందించడం లేదని ఫిర్యాదు చేస్తూ షఫీక్ ఉజ్జమాన్ అనే ఐఎఎస్ అధికారి హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై హైకోర్టు విచారణను చేపట్టింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 11వ తేదీన ప్రభుత్వం ఆరుగురు అవినీతి ఐఎఎస్ అధికారుల జాబితాను ప్రకటించింది.
ప్రభుత్వం సమర్పించిన జాబితాపై అసంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు మొత్తం జాబితాను సమర్పించడానికి రెండు వారాల గడువు ఇచ్చింది. దీంతో ప్రభుత్వం మరో పది అవినీతి అధికారుల జాబితాను హైకోర్టుకు సమర్పించింది. ప్రభుత్వం సమర్పించిన జాబితాలో వినోద్ కుమార్ అగర్వాల్, ప్రియరంజన్ దాస్, బి. నర్సయ్య, కృపానందం, వరప్రసాద్, గార్గ్, నరేంద్రనాథ్, ఆర్.ఎస్. గోయల్, జి.యస్.జి. అయ్యంగార్ పేర్లున్నాయి. తమ వద్ద ఉన్న సమాచారం ఇంతేనని ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసింది. కేసు విచారణను హైకోర్టు ఎల్లుండికి వాయిదా వేసింది.