సియం ఆఫీసు వద్ద మహిళ హడావిడి
హైదరాబాద్: సచివాలయంలో సి బ్లాక్ లోని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి కార్యాలయంలోకి చొచ్చుకుపోవడానికి ప్రయత్నించిన అంజలి అనే మహిళను భద్రతా సిబ్బంది బుధవారం అదుపులోకి తీసుకున్నారు. క్వార్టర్ విషయంలో తనకు అధికారులు అన్యాయం చేశారని, ఆ విషయాన్ని ముఖ్యమంత్రికి విన్నవించడానికి వచ్చానని చెబుతూ ఆమె ఆందోళనకు దిగింది. ముఖ్యమంత్రి బుధవారం మధ్యాహ్నం మూడు గంటలకు సందర్శకులను కలవడానికి సమయం ఇచ్చారు. అయితే ఆ సమయం కన్నా ముందే ఆ మహిళ ముఖ్యమంత్రి కార్యాలయంలోకి చొచ్చుకుపోవడానికి ప్రయత్నించింది.
హైదరాబాదులోని మలకపేటకు చెందిన అంజలి తనకు కేటాయించిన క్వార్టరును వేరొకరికి కేటాయించారని ఆమె ఆరోపించింది. తన భర్తకు ఆ క్వార్టరును కేటాయించారని, 20, 30 ఏళ్లుగా తాము ఆ క్వార్టరులోనే ఉంటున్నామని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వేరేవారితో కుమ్మక్కయి తమను ఖాళీ చేయించడానికి దాన్ని వేరొకరికి కేటాయించారని ఆమె అంటోంది. ఈ విషయాన్ని తాను నేరుగా ముఖ్యమంత్రికి నేరుగా చెప్పేందుకే వచ్చానని ఆమె చెబుతోంది.












Click it and Unblock the Notifications