ముస్లిం రిజర్వేషన్లతో మతచిచ్చు: బిజెపి
హైదరాబాద్: ముస్లిం రిజర్వేషన్లు కల్పించడం ద్వారా కాంగ్రెసు ప్రభుత్వం మత విద్వేషాలకు ఆజ్యం పోస్తోందని భారతీయ జనతా పార్టీ (బిజెపి) శాసనసభ్యుడు జి. కిషన్ రెడ్డి విమర్శించారు. విద్య, ఉద్యోగాల్లో ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముస్లిం రిజర్వేషన్ల విషయంలో కోర్టు తీర్పును శిరసా వహించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
జలయజ్ఞం, భూయజ్ఞాల ద్వారా సంపాదించిన సొమ్మును కాంగ్రెసు ఉప ఎన్నికల్లో ఖర్చు చేస్తూ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తోందని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి నుంచి మంత్రి రఘవీరా రెడ్డి వరకు కాంగ్రెసువారు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తున్నారని ఆయన అన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్థాయి ఉన్నతాధికారి ఎన్నికల కమీషన్ వద్దకు వెళ్లి తప్పైపోయిందని అనడాన్ని బట్టి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చునని, ఇటువంటి సంఘటన జరగడం రాష్ట్రంలో ఇదే మొదటిసారి అని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications