రాజీ సూత్రానికి లెఫ్ట్ తిరస్కరణ
న్యూఢిల్లీ: అణు ఒప్పందంపై రాజీ సూత్రాన్ని వామపక్షాలు తిరస్కరిస్తున్నాయి. అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ ఎదుట రక్షణ ఒప్పందానికి తుదిరూపు ఇప్పించుకోవడానికి యుపిఎ ప్రభుత్వం ముందుకు తెచ్చిన రాజీ సూత్రాన్ని వామపక్షాలు తిరస్కరిస్తున్నాయి. రాజీసూత్రం అర్థరహితమని అవి వాదిస్తున్నట్లు సమాచారం. ఐఎఇఎ గవర్నర్లు ఆమోదించిన వెంటనే రక్షణ ఒప్పందం విషయంలో దాతంటదే ముందుకు సాగుతుందనే ఉద్దేశంతో వామపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి.
సిపిఎం ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ సమాజ్ వాదీ పార్టీ నేత ములాయం సింగ్ ను కలిసి దానిపై చర్చించారు. వామపక్షాల వైఖరిని కారత్ ములాయంకు వివరించారు. అంతకు ముందు ఆయన విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీని కలుసుకున్నారు. అణు ఒప్పందాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని, అయితే ఈ విషయంలో పునరాలోచన చేయదలుచుకుంటే వామపక్షాలను విశ్వాసంలోకి తీసుకుంటామని ములాయం కారత్ తో చెప్పారు. అణు ఒప్పందంపై ప్రభుత్వం ఐఎఇఎ ముందుకు మాత్రమే పోతుందని, దాన్ని న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ ముందు పెట్టబోదని యుపిఎ మిత్రపక్షాలు రాజీ సూత్రాన్ని ప్రతిపాదించాయి.
కారత్ భేటీ తర్వాత ప్రణబ్ ముఖర్జీ రక్షణ మంత్రి ఎ.కె. ఆంటోనీతో కలిసి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ నివాసానికి వెళ్లారు. కారత్ తో జరిగిన చర్చలపై వారు సోనియాకు వివరిస్తారు. తమ వైఖరిలో మార్పు లేదని సిపిఐ ప్రధాన కార్యదర్శి ఎ.బి. బర్దన్ చెప్పారు. ప్రభుత్వం ఏదైనా ప్రతిపాదనతో ముందుకు వస్తే ఆలోచిస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications