హైదరాబాద్: ఈ నెల 22వ తేదీన జరిగే బలపరీక్షలో యుపిఎ ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని భారతీయ జనతా పార్టీ (బిజెపి) సీనియర్ నాయకుడు ఎం. వెంకయ్యనాయుడు అన్నారు. వామపక్షాలు తమతో కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు చేయబోవడంపై కాంగ్రెసు చేస్తున్న వ్యాఖ్యలపై ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో విరుచుకుపడ్డారు. మతతత్వాన్ని వదులుకుంటే బిజెపితో కలిసి పనిచేస్తామని ప్రకటన చేసిన వామపక్షాలపై ఆయన వ్యంగ్యాస్త్రాలు విసిరారు. కమ్యూనిస్టులు సిద్ధాంతాన్ని వదులుకుంటే వారితో కలిసి పని చేస్తామని ఆయన అన్నారు. బిజెపితో కలిసి వామపక్షాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు చేస్తే అపవిత్రమై పోతారన్నట్లుగా కాంగ్రెసువారు మాట్లాడుతున్నారని, గుజరాత్ లో తమతో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చిందని, విపిసింగ్ ప్రభుత్వాన్ని కూడా అదే విధంగా కూల్చిందని ఆయన అన్నారు.