ముషార్రఫ్ కు పదవీ గండం
ఇస్లామాబాద్: పాకిస్తాన్ సంకీర్ణ ప్రభుత్వం తనను తొలగించడానికి ప్రయత్నిస్తున్నదనే వార్తలు రావడంతో అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ తన చైనా పర్యటనను అర్థాంతరంగా రద్దు చేసుకున్నారు. ఓలింపిక్ క్రీడల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడానికి ఆయన చైనాకు వెళ్లాల్సి ఉంది. ముషార్రఫ్ తొలగింపుపై సంకీర్ణ భాగస్వామ్య పార్టీలు పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ, నవాజ్ షరీఫ్ నాయకత్వంలోని పిఎంఎల్ (ఎన్) కీలకమైన చర్చలు జరపబోతున్నాయనే వార్తలు రావడంతో ముషార్రఫ్ బీజింగ్ పర్యటనను రద్దు చేసుకున్నారని విదేశాంగ కార్యాలయం అధికార ప్రతినిధి మొహమ్మద్ సాదిఖ్ విలేకరులకు చెప్పారు.
ముషార్రఫ్ పర్యటన రద్దుకు ఇతర అధికారులెవరూ కారణం చెప్పడం లేదు. ముషార్రఫ్ తనకు సన్నిహితులైన రాజ్యాంగ, న్యాయ వ్యవస్థలకు చెందినవారితో సమావేశానికి సిద్ధపడ్డారు. తనను తొలగించడానికి జరుగుతున్న ప్రయత్నాలను తిప్పికొట్టడానికి ఆయన రావల్పిండిలోని తన క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం ఏర్పాటు చేశారు. తమ సమావేశానికి సంబంధించిన వివరాలపై రెండు పార్టీల నాయకులు కూడా పెదవి విప్పడం లేదు. ఇరు పార్టీల నాయకులు బుధవారం ఉదయం పదకొండున్నర గంటలకే సమావేశం కావాల్సి ఉంది. అయితే ఈ సమావేశం మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా పడింది. ఈ రెండు ప్రధాన పార్టీలు ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత జమైత్ ఉలేమా -ఎ - ఇస్లామ్, అవామీ నేషనల్ పార్టీ నాయకులతో, గిరిజన ప్రాంతాలకు చెందిన పార్లమెంటు సభ్యులతో సంప్రదింపులు జరుపుతాయి.












Click it and Unblock the Notifications