ఇల్లలకగానే...: చిరుపై నారాయణ
హైదరాబాద్: ప్రజా సమస్యలపై తాము చేపడుతున్న ఐక్య ఉద్యమాలకు మెగాస్టార్ చిరంజీవి కలిసి రావాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ సూచించారు. ఇల్లలకగానే పండుగ కాదని చిరంజీవి బంజారాహిల్స్ లో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడంపై ఆయన వ్యాఖ్యానించారు. చిరంజీవి పార్టీ విధానాలను ప్రకటించాలని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. చిరంజీవి పార్టీ విధివిధానాలను ప్రకటించిన తర్వాతనే పొత్తు విషయంపై మాట్లాడుతామని ఆయన అన్నారు. చిరంజీవి పార్టీ విధానాలు సామాన్యులకు, సమాజంలో అత్యధిక ప్రజలకు మేలు చేస్తాయా లేదా చూడాల్సి ఉందని, అలాగే లౌకిక విధానానికి చిరంజీవి కట్టుబడి ఉంటారా లేదా కూడా చూడాల్సి ఉంటుందని ఆయన అన్నారు.
తాము ఏర్పాటు చేసిన మహా కూటమి రాజకీయ వేదిక కాదని, ప్రజా సమస్యలపై ఐక్యంగా పోరడడానికి వేసిన కూటమి అని ఆయన అన్నారు. కాంగ్రెస్, బిజెపిలకు వ్యతిరేకంగా రాష్ట్రంలో తృతీయ ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నాలను విరమించుకోలేదని ఆయన చెప్పారు. తమ పార్టీ రాష్ట్ర కమిటీ అభిప్రాయాల మేరకే కేంద్ర కమిటీ నిర్ణయాలు ఉంటాయని ఆయన చెప్పారు. చిరంజీవి తన విధానాలను వెల్లడించక ముందే వ్యాఖ్యలు చేయడం తొందరపాటే అవుతుందని ఆయన అన్నారు. కొత్త పార్టీలు రావడం మంచిదేనని, దాని వల్ల రాజకీయాల్లో ఏకాధిపత్యానికి కాలం చెల్లుతుందని, ప్రజలకు మేలు చేసే రాజకీయాలు వచ్చే అవకాశం ఉందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications