విశాఖలో బీభత్సం: ఇద్దరు మృతి
విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీంతో పరిస్థితి అతలాకుతలమైంది. మూడు నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నగరంలో సాధారణ జీవితం గందరగోళంగా మారింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. విశాఖ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఎస్ రాయవరం మండలం ధర్మవరం అగ్రహారానికి చెందిన బంగారు అప్పన్న, చింతపల్లి మండలం అన్నవరం గ్రామానికి చెందిన వి. రాజేశ్వరి నదిలోపడి మృతి చెందారు.
గోస్తనీ, గంభీర్పేట జలాశయాలకు నీరుచేరింది. ముడసర్లోవ, రైవాడ, తాటిపూడి, ఏలేరు జలాశయాల్లో నీటిమట్టం పెరిగింది. తాండవ జలాశయంలో వరదనీరు అధికంగా చేరుతోంది. అనకాపల్లిలో గుడిసెల్లోకి నీరు చేరింది. శారదా నది సమీపంలో కొత్తూరు, సత్యనారాయణపురం, ఎన్జీవో కాలనీలు నీటమునిగాయి. రహదారులు కూడా జలమయంగా ఉన్నాయి. జిల్లాలోని యలమంచిలి పట్టణాన్ని వరదనీరు ముంచెత్తింది. కుంభవృష్టితో కాలనీలన్నీ మునిగిపోయాయి. జాతీయ రహదారి మీద నీరు పొంగి ప్రవహించింది. ఆ దారిలో వెళుతున్న రెండు మోటారుబైకులవారు దాటేందుకు ప్రయత్నించగా బైకులు కొట్టుకునిపోయి వారు ప్రాణాలతో బయటపడ్డారు. ప్రభుత్వ కార్యాలయాలు, వసతిగృహాలు ముంపునకు గురయ్యాయి.












Click it and Unblock the Notifications