లగడపాటి ల్యాంకోపై తెరాస దాడి
హైదరాబాద్: హైదరాబాదులోని జూబిలీహిల్స్ లో గల కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ కు చెందిన ల్యాంకో హిల్స్ కార్యాలయంపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) కార్యకర్తలు గురువారం సాయంత్రం దాడి చేశారు. నిజామాబాదులో తమ పార్టీ కార్యకర్తను లగడపాటి రాజగోపాల్ కారు ఢీకొట్టడంతో ఆగ్రహించిన తెరాస కార్యకర్తలు ఈ దాడికి దిగారు. దాదాపు 200 మంది తెరాస కార్యకర్తలు రాళ్లతో ల్యాంకో కార్యాలయంపై దాడి చేశారు. కార్యాలయం వద్ద ఉన్న కార్లు, కార్యాలయం అద్దాలు ఈ దాడిలో ధ్వంసమయ్యాయి.
తెరాస కార్యకర్త కాలిపై నుంచి ఎవరి కారు వెళ్లిందో తెలియదని రాజగోపాల్ అంటున్నారు. ప్రణబ్ ముఖర్జీ వద్ద తెరాస కార్యకర్తల నిరసనకు తనకు ఏ విధమైన సంబంధం లేదని ఆయన అన్నారు. తెరాస శాసనసభ్యుడు హరీష్ రావు చౌకబారు రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు. లగడపాటి రాజగోపాల్ ను, ఆయన డ్రైవరును వెంటనే అరెస్టు చేయాలని తెరాస పార్లమెంటు సభ్యుడు వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. లగడపాటి రాజగోపాల్ అనవసరంగా తెలంగాణ ప్రజలను రెచ్చగొడుతున్నారని హరీష్ రావు విమర్శించారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ షష్టిపూర్తి కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రణబ్ ముఖర్జీ నిజామాబాద్ వచ్చారు. ఆయనతో పాటు లగడపాటి రాజగోపాల్ కూడా నిజామాబాద్ వచ్చారు.












Click it and Unblock the Notifications