ఘర్షణ: ఎమ్మెల్యే గన్ మెన్ కాల్పులు
కడప: కడప జిల్లా రాయచోటిలో తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. రుణ మాఫీ పథకం కింది రైతులకు ఐదు వేల రూపాయల ప్రోత్సాహకాలు అందించే సమయంలో ఈ ఘర్షణ చెలరేగింది. తెలుగుదేశం శాసనసభ్యుడు పాలకొండరాయుడు ప్రభుత్వంపై విమర్శలు చేశారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్లు రువ్వారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. దాంతో పాలకొండరాయుడు గన్ మన్ గాలిలోకి కాల్పులు జరిపాడు. ఘర్షణలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) సభ్యుడు రాంప్రసాద్ రెడ్డి తలకు గాయమైంది. మూడు వాహనాలు ధ్వంసమయ్యాయి.
శాసనసభ్యుడు పాలకొండరాయుడు, జిల్లా పరిషత్ ఉపాధ్యక్షుడు దేవనాథ్ రెడ్డికి మధ్య వివాదం చెలరేగింది. ఇక్కడ మాజీ శాసనసభ్యుడు నారాయణ రెడ్డి కూడా ఉన్నారు. పోలీసులు అప్రమత్తంగా లేకపోవడంతో ఈ ఘర్షణ చెలరేగినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ఘర్షణకు దిగిన కార్యకర్తలను పోలీసులు లాఠీచార్జి చేసి చెదరగొట్టారు. ఈ ఘర్షణతో రాయచోటిలో 144వ సెక్షన్ విధించారు.