ఎన్డీ తివారీ మెడకు కొడుకు కేసు
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎన్డీ తివారి మెడకు కొడుకు కేసు చుట్టుకుంది. వచ్చేనెల 16వ తేదీన తమ ముందు హాజరు కావాలని ఢిల్లీ హైకోర్టు మంగళవారం తివారీని ఆదేశించింది. తన ఛాంబర్ లో ఇరు వర్గాలు హాజరు కావాలని హైకోర్టు న్యాయమూర్తి ఆదేశించారు. మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెసు నాయకుడు షంషేర్ సింగ్ మనవడు రోహిత్ శేఖర్ తన తండ్రి తివారీయేనని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై హైకోర్టు ఆ ఆదేశాలు జారీ చేసింది. తన తల్లి ఉజ్వల సింగ్ తో తివారీకి గల వైవాహికేతర సంబంధంతోనే తాను పుట్టానని రోహిత్ శేఖర్ పిటిషన్ వేశారు.
తనను కుమారుడిగా అంగీకరించడానికి నిరాకరించినందు వల్లనే పిటిషన్ వేసినట్లు రోహిత్ శేఖర్ చెప్పాడు. తాను గౌరవప్రదమైన కుటుంబానికి చెందినదానినని, తన తండ్రి కేంద్ర మాజీ మంత్రి అని, అటువంటి సమాచారం వెల్లడించడానికి తెగువ కావాలని, తాను తన కుమారుడు రోహిత్ కు అండగా నిలబడుతున్నానని అప్పట్లో ఉజ్వల సింగ్ అన్నారు. రోహిత్ శేఖర్ డిఎన్ఎ పరీక్షకు అంగీకరిస్తున్నాడని, అయితే తివారీ అందుకు నిరాకరిస్తున్నారని ఆమె చెప్పారు.
రోహిత్ వేసిన పిటిషన్ పై రాష్ట్ర గవర్నర్ ఎన్డీ తివారీ కోర్టు విచారణ పరిధిని ప్రశ్నించారు. తాను ప్రస్తుతం హైదరాబాదులో ఉంటున్నానని, రోహిత్ లక్నోలో పుట్టాడని, అందువల్ల ఢిల్లీలో విచారణ సరైంది కాదని ఆయన వాదించారు. రోహిత్ పిటిషన్ ను కోర్టు ఏప్రిల్ లో విచారణకు స్వీకరించి, తివారీకి నోటీసులు పంపింది. రోహిత్ ను కొడుకుగా తివారీ స్వీకరించాలని అప్పట్లో షంషేర్ సింగ్ అన్నారు. ఈ విషయంపై పార్టీ నాయకత్వానికి కూడా ఆయన లేఖ రాశారు.