వచ్చే నెలాఖరులో పెట్రో ధరల తగ్గింపు
న్యూఢిల్లీ: పెట్రోల్ ధరలను డిసెంబర్ నెలాఖరులో తగ్గిస్తామని పెట్రోలియం శాఖా మంత్రి మురళీ దేవరా చెప్పారు. ప్రస్తుతం శాసనసభ ఎన్నికలు జరుగుతున్నందున ఆ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అందుకు అడ్డుగా ఉందని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. శాసనసభల ఎన్నికల వల్లనే తాము ఇంధన ధరలను తగ్గించలేకపోతున్నామని, డిసెంబర్ 24వ తేదీ తర్వాత తగ్గిస్తామని ఆయన అన్నారు.
జులైలో బ్యారెల్ ముడి చమురు ధర 147 డాలర్లు ఉండగా అది 54 డాలర్లకు తగ్గింది. అయినా ప్రభుత్వం ఇంధన ధరలను తగ్గించలేదు. ముడిచమురు ధర తగ్గిందని, ఇంధన ధరలను తగ్గించాల్సి ఉందని, అయితే ఎన్నికల ప్రవర్తనా నియమావళి తగ్గించలేకపోతున్నామని మురళీ దేవరా అన్నారు. తమ మంత్రిత్వ శాఖ డిసెంబర్ 24వ తేదీలోగా ఇంధన ధరల తగ్గింపుపై, సబ్సిడీలపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామని ఆయిల్ కార్యదర్శి ఆర్ ఎస్ పాండే చెప్పారు. జూన్ లో ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను పది శాతం పెంచింది. ముడి చమురు ధర తగ్గినా అదే దరకు ఆ ఇంధనాలను విక్రయిస్తోంది.