పాక్ పై సైనిక చర్యకూ ఆలోచన?
న్యూఢిల్లీ: ముంబై ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో సైనిక చర్యకు దిగే అవకాశాలను భారత విదేశీ వ్యవహారాల మంత్రి త్వ శాఖ తోసిపుచ్చడం లేదు. పాకిస్తాన్ పై సైనిక చర్య ఉండదనే వార్తలను మంత్రిత్వ శాఖ మంగళవారం ఖండించింది. పాకిస్తాన్ పై సైనిక చర్య ఉండదని విదేశీ వ్యవహారాల మంత్రి ప్రణబ్ ముఖర్జీ చేసిన ప్రకటన నేపథ్యంలో మంత్రిత్వ శాఖ వివరణ ఇచ్చింది. నిజానికి ప్రణబ్ ముఖర్జీ సైనిక చర్యను తోసిపుచ్చలేదని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ విషయంలో మంత్రిత్వ శాఖ నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
తాము సైనిక చర్య గురించి పరిశీలించడం లేదని, తమ డిమాండ్లకు పాకిస్తాన్ ఎలా ప్రతిస్పందిస్తుందనేది చూడాల్సి ఉందని ప్రణబ్ ముఖర్జీ అన్నారు. ఏం చేయాలనే దానికి కాలమే సమాధానం చెబుతుందని ఆయన అన్నారు. భారత్ కు తనను తాను రక్షించుకునే హక్కు ఉందని అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన బరాక్ ఒబామా చేసిన ప్రకటన నేపథ్యంలో ప్రణబ్ నుంచి ఆ వ్యాఖ్య వచ్చింది. సైనిక చర్య ఉంటుందా అని అడిగితే ఎవరు కూడా సైనిక చర్య గురించి ఆలోచించడం లేదని ఆయన సమాధానమిచ్చారు. 20 మంది నేరస్థులను పాకిస్థాన్ భారత్ కు అప్పగించే విషయంలో, పాకిస్థాన్ లోని ఉగ్రవాద శిబిరాలను మట్టుబెట్టడంలో తీసుకునే చర్యపై తమ ప్రతిస్పందన ఉంటుందని ఆయన అన్నారు. ఇదిలా ఉంటే, ముంబై ఉగ్రవాద దాడులపై సంయుక్త దర్యాప్తునకు తాము సిద్ధంగా ఉన్నామని పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఖురేషీ చెప్పారు.