జనసైనికులకు గుడ్ న్యూస్. నాగబాబు, బాలినేనికి కీలక బాధ్యతలు
జనసేన పార్టీలో సంస్థాగత మార్పులకు, భవిష్యత్ వ్యూహాలకు అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శ్రీకారం చుట్టారు. కేవలం ఎన్నికల వేళ మాత్రమే కాకుండా.. క్షేత్రస్థాయి నుంచి పార్టీని పటిష్టం చేసి, సాధారణ కార్యకర్తలను సైతం రేపటి తరం నాయకులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఒక భారీ కార్యాచరణను ప్రకటించారు. తన స్వీయ పర్యవేక్షణలో "జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీలను" నియమిస్తున్నట్లు పవన్ కల్యాణ్ ట్విట్టర్ (X) ద్వారా వెల్లడించారు. 2014 నుంచి ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొంటూ పార్టీ జెండాను భుజాన మోసిన అసలైన జనసైనికులకు గుర్తింపునిచ్చేలా ఈ కమిటీలు పని చేయనున్నాయి.
పార్లమెంట్ నుంచి విలేజ్ స్థాయి వరకు.. పక్కా స్కెచ్!
పార్టీ నిర్మాణంలో ఎలాంటి పక్షపాతం లేకుండా, కేవలం ప్రతిభ, అంకితభావానికే పెద్దపీట వేసేలా పవన్ కల్యాణ్ ఈ కమిటీల నిర్మాణాన్ని డిజైన్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 25 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో క్షేత్రస్థాయి సమాచారాన్ని సేకరించడమే ఈ కమిటీల ప్రధాన ఉద్దేశం. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కనీసం ముగ్గురు 'సాధక్స్' (సభ్యత్వ నమోదులో చురుగ్గా పాల్గొన్నవారు) చొప్పున, ఒక సీనియర్ పరిశీలకుడు, స్థానిక అంశాలపై పట్టున్న ముగ్గురు సీనియర్ నాయకులతో కూడిన 28 మంది సభ్యుల భారీ కమిటీ ప్రతి లోక్సభ స్థానంలో పనిచేస్తుంది. వీరికి సహాయంగా కేంద్ర కార్యాలయం నుంచి ప్రత్యేక సిబ్బంది కూడా ఉంటారు.

ఎవరు ఏ బాధ్యతకు అర్హులు? అభ్యర్థుల నుంచి దరఖాస్తులు
ఈ సరికొత్త ప్రక్రియలో భాగంగా, తొలి నుంచి పార్టీ కోసం కష్టపడిన వారి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. నియోజకవర్గాల్లో ఏ కార్యకర్త ఏ స్థాయిలో బాధ్యతలు తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు? ఎవరికి ఏ విభాగంలో పట్టు ఉంది? అనే వివరాలను సేకరించేందుకు 25 పార్లమెంట్ స్థానాలకు ఒక్కో పరిశీలకుడిని నియమించారు. పార్లమెంట్ స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు పార్టీలో పనిచేసేందుకు ఉత్సాహంగా ఉన్నవారి సమాచారాన్ని వీరు సేకరిస్తారు. ఆ తర్వాతే.. నేరుగా పవన్ కల్యాణ్ సమక్షంలో అభ్యర్థుల లీడర్షిప్ క్వాలిటీస్, నైపుణ్యాన్ని బట్టి తుది బాధ్యతలు కేటాయించనున్నారు.
- శ్రీకాకుళం: వంశీకృష్ణ శ్రీనివాస్
- విజయనగరం: కొరికాన రవికుమార్
- విశాఖపట్నం: కొణతాల రామకృష్ణ
- అరకు: కొణిదెల నాగబాబు
- అనకాపల్లి: పెండెం దొరబాబు
- అమలాపురం: పంచకర్ల రమేష్ బాబు
- కాకినాడ: సామినేని ఉదయభాను
- రాజమహేంద్రవరం: కొటికలపూడి గోవిందరావు
- ఏలూరు: బత్తుల బలరామకృష్ణ
- నరసాపురం: పంతం నానాజీ
- విజయవాడ: కందుల దుర్గేష్
- మచిలీపట్నం: పిడుగు హరిప్రసాద్
- గుంటూరు: బొలిశెట్టి శ్రీనివాస్
- నరసరావుపేట: బాలినేని శ్రీనివాసరెడ్డి
- బాపట్ల: దేవ వరప్రసాద్
- ఒంగోలు: కిలారు వెంకట రోశయ్య
- నెల్లూరు: బొమ్మిడి నాయకర్
- తిరుపతి: లోకం నాగమాధవి
- చిత్తూరు: పత్సమట్ల ధర్మరాజు
- రాజంపేట: కల్యాణం శివశ్రీనివాస్
- కడప: చిలకం మధుసూదన్రెడ్డి
- కర్నూలు: టి.ఉదయ శ్రీనివాస్
- నంద్యాల: వల్లభనేని బాలశౌరి
- హిందూపురం: చిల్లపల్లి శ్రీనివాసరావు
- అనంతపురం: వేములపాటి అజయ్కుమార్
సాధారణంగా ప్రాంతీయ పార్టీలలో పదవుల పెంపకం అనేది కేవలం సిఫార్సులు, పైస్థాయి పరిచయాల ఆధారంగా జరుగుతుంటుంది. కానీ, పవన్ కల్యాణ్ ఏరికోరి 'సమాచార సేకరణ కమిటీల'ను వేయడం వెనుక ఒక పెద్ద రాజకీయ వ్యూహం ఉంది. క్షేత్రస్థాయిలో కష్టపడిన నిజమైన కేడర్ను గుర్తించి వారికి పదవులు ఇస్తే.. పార్టీ పునాదులు మరింత గట్టిపడతాయనేది జనసేనాని ఆలోచన. ఈ సరికొత్త ప్రయోగం రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాల్లో ఎలాంటి మార్పులకు దారితీస్తుందో చూడాలి.














Click it and Unblock the Notifications