ఆ టెర్రరిస్టు నా కొడుకే!
ఇస్లామాబాద్: మొత్తానికి ముంబై ముట్టడికి దిగిన ఉగ్రవాది అజ్మల్ అమీర్ ఇమాన్ అలియాస్ కసబ్ పాక్ జాతీయుడే అని స్పష్టమైంది. అతడి కన్నతండ్రి అమీర్ కసబ్ మీడియా ముందు 'కసబ్ నా కుమారుడే' అని వెల్లడించాడు.కసబ్ తండ్రి ఫరీద్కోట్లోని తన స్వగృహం వద్ద 'డాన్' పత్రికతో మాట్లాడుతూ ఈ విషయాలన్నీ వెల్లడించాడు. "వాడి ఫొటోను పత్రికల్లో చూశాను. వాడు నా కొడుకే అని తెలుసు. కానీ... కాదని అబద్ధమాడాను. ఇప్పుడు నిజం చెబుతున్నా. వాడు నా కుమారుడే'' అని అమీర్ ద్రువీకరించాడు.
కసబ్ నాలుగేళ్ల క్రితం ఒకసారి పండగకు కొత్త బట్టలు కావాలని అడిగాడు. కానీ... నేను కొనలేకపోయాను. అలిగి ఇంటి నుంచి వెళ్లిపోయాడు అని అమీర్ తెలిపాడు. తమది పక్కనే ఉన్న హవేలీ లఖా అనే గ్రామమని, చాలా ఏళ్ల క్రితం ఫరీద్కోట్కు వచ్చి స్థిరపడ్డామని చెప్పారు. వీధిలో 'పకోడా'లు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నామని తెలిపారు.
'కొందరు శత్రువులు నా కుమారుడిని మా నుంచి దూరం చేశారు' అని తెలిపారు. అయితే 'ఆ శత్రువులు' ఎవరో మాత్రం చెప్పలేదు. అమీర్ కసబ్కు ఐదుగురు పిల్లలు. వీరిలో ముగ్గురు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు. అమీర్ 'డాన్' పత్రికతో మాట్లాడుతున్నప్పుడు... ఆయన భార్య (కసబ్ తల్లి) అదే గదిలో ఒకమూలకు చద్దర్ కప్పుకొని కూర్చుని ఉంది. ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు కూడా తండ్రి మాటలు వింటూ నిల్చున్నారు. అజ్మల్ పాక్ జాతీయుడేనంటూ బ్రిటన్కు చెందిన 'అబ్జర్వర్' పత్రిక అతడి ఇంటి చిరునామాతో సహా ఒక ప్రత్యేక కథనం ప్రచురించింది. ఇప్పుడు అది నిజమని తేలింది.