బ్రిటన్ లో నాగరాజుకు జీవిత ఖైదు
లండన్: ఏడు నెలల క్రితం బ్రిటన్లో దారుణ హత్యకు గురైన వెంపల సామ్రాజ్య జ్యోతిర్మయి(23) కేసులో హంతకుడు తెలుగోడైన నల్లూరి నాగరాజకుమారే(25)నని ఇక్కడి కోర్టు నిర్ధారించింది. బర్మింగ్హామ్లోని హాండ్స్వర్త్లో ఆమె ఫ్లాటులోనే ఉండే అతడు హత్యకు ముందు జ్యోతిపై అత్యాచార యత్నంచేశాడని తెలిపింది. తన రక్తంతో గోడపై 'ఐ లవ్ జ్యోతి' అని రాశాడని పేర్కొంది. ఇంతటి కిరాతకానికి ఒడిగట్టిన నాగరాజుకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ బర్మింగ్హామ్ క్రౌన్ కోర్టు ఈ నెల 12న తీర్పు వెలువరించింది. 25 ఏళ్ల శిక్షపూర్తయ్యే వరకూ నాగరాజుకు పెరోల్ ఇచ్చే అంశాన్ని కనీసం పరిశీలించేది కూడా లేదని స్పష్టంచేసింది. నాగరాజ కుమార్ జ్యోతిర్మయి తలపై 12 దెబ్బలు కొట్టాడని, ఆ తర్వాత చేతి మణికట్టును, మెడను కోశాడని, ఆ రక్తంతో ఐ లవ్ జ్యోతి అని గోడమీద రాశాడని ప్రాసిక్యూటర్ తెలిపారు.
విజయవాడ చిట్టినగర్లోని కేటీరోడ్కు చెందిన జ్యోతిర్మయి అక్కడే ఫిజియోథెరపీ కోర్సు పూర్తి చేసి.. ఉన్నత చదువుల కోసం 2007 సెప్టెంబరులో బ్రిటన్కు వెళ్లింది. అక్కడ ఓల్వర్హాంప్టన్ విశ్వవిద్యాలయంలో ప్రజారోగ్యం అంశంలో ఎంఎస్ చదవడం ప్రారంభించింది. బర్మింగ్హామ్ శివారుపట్టణమైన హాండ్స్వర్త్లోని ఓ ఫ్లాటులో మరో నలుగురు ఆంధ్రులతో కలిసి ఆమె ఉండేది. వారిలో నాలుగో వ్యక్తి హైదరాబాద్కు చెందిన నల్లూరి నాగరాజకుమార్. ఇతడు విజయవాడలో చదువుతున్నప్పుడు జ్యోతి పరిచయమైంది. హైదరాబాద్లోని ఖైరతాబాద్లో ఉన్న ఓవర్సీస్ ఎడ్యుకేషన్ ఫర్ యూ సంస్థ ద్వారా ఇద్దరూ ఒకేసారి బ్రిటన్ వెళ్లి ఒకే విశ్వవిద్యాలయంలో చేరారు. ఈ ఏడాది మే 6న జ్యోతిర్మయి తన ఫ్లాటులోనే హత్యకు గురైంది.
కొందరు నల్లజాతి యువకులు తమ ఇంట్లోకి ప్రవేశించి జ్యోతిర్మయిని చంపేశారంటూ తీవ్రగాయాలతో ఉన్న నాగరాజు అప్పట్లో చెప్పాడు. అయితే అతడే ఈ హత్య చేశాడని ప్రాథమికంగా అంచనాకు వచ్చిన బ్రిటన్ పోలీసులు అప్పట్లో నాగరాజు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కాగానే అరెస్టు చేశారు.