తెలంగాణ వాణి వినిపిద్దాం: చిరు
నల్లగొండ: తెలంగాణ రాష్ట్ర సాధనకు ప్రజలు శక్తినిస్తే ఢిల్లీకి వెళ్లి మన వాణిని వినిపిద్దామని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తీరుతుందని ఆయన అన్నారు. తాము తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా ఉన్నామని, అందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. నల్లగొండ జిల్లా భువనగిరి సభలో ఆయన గురువారం ప్రసంగించారు. తాము తెలంగాణకు అనుకూలమని జగిత్యాలలో చెప్పానని, అదే విషయాన్ని మళ్లీ చెబుతున్నానని, ప్రజల అభీష్టమే తమ అభీష్టమని ఆయన అన్నారు. తాము సామాజిక తెలంగాణ సాధన కోసం కృషి చేస్తామని ఆయన చెప్పారు.
రాజకీయాలు గొప్ప విషయం కాదని, ప్రజలకు సేవ చేయాలనే చిత్తశుద్ధి ఉండాలని ఆయన అన్నారు. మీరు నన్ను నమ్మారు, నమ్మండి. మీ నమ్మకాన్ని నేను వమ్ము చేయను అని ఆయన అన్నారు. తమకు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని ఆయన ప్రజలను కోరారు. తాను ప్రజలను నమ్మారని, తనను ప్రజలు నమ్ముతున్నారని ఆయన అన్నారు. మరింత మేలు కోసం మార్పును ఆహ్వానిద్దామని ఆయన సూచించారు. ప్రజలే నాయకులు కావాలని, అందుకు ప్రజారాజ్యం కృషి చేస్తుందని ఆయన చెప్పారు. చిరంజీవి మూడు రోజుల పాటు నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నారు.